అక్రమాలను ప్రశ్నించినందుకే ఉమపై కేసులు
ABN , First Publish Date - 2021-08-06T09:25:34+05:30 IST
అక్రమాలను ప్రశ్నించినందుకే ఉమపై కేసులు
కన్నబాబు మంత్రి పదవికి అనర్హుడు: పట్టాభిరాం
రాజమహేంద్రవరం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మైనింగ్ అక్రమాలను ప్రశ్నించడం వల్లే మాజీ మంత్రి దేవినేని ఉమపై తప్పుడు కేసులు పెట్టారు’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం దుయ్యబట్టారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది నుంచి మైనింగ్లో జరుగుతున్న అక్రమాలను, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమాలను దేవినేని ఆధారాలతో బయటపెట్టడంతో తట్టుకోలేకపోయారని ఆరోపించారు. ఆయన మళ్లీ మైనింగ్ సందర్శించడానికి వెళ్తే దాడి చేసి, తిరిగి కేసులు పెట్టి, అరెస్టు చేయడం దారుణమన్నారు.
‘వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు జిల్లాలోనే ఉన్నప్పటికీ, రైతులను పట్టించుకోవడం లేదు. పండించిన పంటకు ధరలేదు. అమ్మిన వాటికి డబ్బులు ఇవ్వడంలేదు. అందుకే రైతులు క్రాప్ హాలిడేకు వెళ్తున్నారు. ఈ దిక్కుమాలిన మంత్రి ఆ పదవికి అనర్హుడు’ అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అక్రమాలపై కోర్టులకు వెళ్తామని.. ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.