రోగులు బయటకొస్తే కేసులే: మహేశ్ భగవత్
ABN , First Publish Date - 2020-07-07T08:01:34+05:30 IST
రోగులు బయటకొస్తే కేసులే: మహేశ్ భగవత్
హైదరాబాద్ సిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): హోం క్వారంటైన్లో ఉండి కొవిడ్ చికిత్స తీసుకోవాల్సిన కొందరు ఇంట్లో ఉండకుండా ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ‘‘కరోనా మహమ్మారి బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన వారు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేకున్నా కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని వైద్యులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. వైద్యులు సూచించినట్లుగా హోం క్వారంటైన్లో ఉండేవారు కచ్చితంగా 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులైనా దూరంగానే ఉండాలి. కానీ కొంతమంది కొవిడ్ బాధితులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఇతరులు కరోనా బారినపడేలా చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. ఇక నుంచి రాచకొండ పరిధిలో హోం క్వారంటైన్లో ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తాం’’ అని సీపీ హెచ్చరించారు.