Bengal SSS Scam: అర్పిత ముఖర్జీ ఆ నాలుగు కార్లు ఏమైనట్టు..?
ABN , First Publish Date - 2022-07-29T21:37:02+05:30 IST
అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు..
కోల్కతా: అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee)కి చెందిన నాలుగు లగ్జరీ కార్లు (Luxury cars) కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఆమెకు చెందిన డైమంట్ సిటీ ఫ్లాట్ సౌత్ కాంప్లెక్స్లో ఉండే ఆ నాలుగు కార్లు ఏమైపోయాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఇందులో పెద్దమొత్తంలో నగదు దాచిపెట్టి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఎస్ఎస్సీ స్కామ్లో మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆయన సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. అర్పితకు చెందిన చినార పార్క్ ఏరియాలోని ఫ్లాట్లో రూ.28 కోట్ల నగదును గత గురువారంనాడు ఈడీ స్వాధీనం చేసుకుంది. టోలీగంజ్ ఏరియాలోని మరో ఫ్లాట్లో రూ.21 కోట్ల నగదు సీజ్ చేసింది.
కాగా, అర్పిత ముఖర్జీకి చెందిన ఒక తెలుపురంగు మెర్సిడీజ్ కారును మాత్రమే ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆమెకు చెందిన మరో నాలుగు కార్లు - ఆడీ A4 WB02AB9561 , హోండా సిటీ WB06T6000, హోండా సీఆర్వీ WB06T6001, మెర్సిడీజ్ బెంజ్ WB02AE2232 కనబడకపోవడాన్ని గుర్తించింది. వీటిలో పెద్ద మొత్తంలో నగదు ఉండవచ్చని అనుమానిస్తున్న అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు సాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కార్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.