నాకు లంచం ఆఫర్ చేసే ధైర్యం వాళ్లకు లేదనే అనుకుంటున్నా..

ABN , First Publish Date - 2020-02-07T19:46:32+05:30 IST

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కేసులతో దేశ వ్యాప్తంగా పరిచయమైన వ్యక్తి..

నాకు లంచం ఆఫర్ చేసే ధైర్యం వాళ్లకు లేదనే అనుకుంటున్నా..

నా లక్ష్యానికి పోలీసు ఉద్యోగం అడ్డు వస్తోందనిపించింది

బీజేపీ, ఆప్‌ ఆహ్వానించాయి

టీడీపీ నుంచి ఎవరూ కలవలేదు

సీబీఐలో తాజా పరిణామాలు దురదృష్టకరం

నాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ఆసక్తి

మహబూబ్‌నగర్‌లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను

కలాం ప్రభావం కూడా నాపై ఉంది

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో సీబీఐ మాజీ జేడీ


వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కేసులతో దేశ వ్యాప్తంగా పరిచయమైన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపనతో... ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. మరో నెలరోజుల్లోపే తన భవిష్యత్‌ కార్యాచరణను తేల్చేస్తానంటున్నారాయన. ఇంకా తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 11-11-2018న నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొని వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

 

లక్ష్మీనారాయణగారు ఎలా ఉన్నారు?

బాగున్నానండీ.. బ్రహ్మాండం.

 

ఆంధ్రప్రదేశ్‌లో వీవీ లక్ష్మీనారాయణ అంటే ఎవరికీ తెలియదు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటేనే అందరికీ తెలుసు. అంత పాపులారిటీ తెచ్చిన ఆ ఉద్యోగాన్ని సడెన్‌గా రిజైన్‌ చేసి వచ్చేయాలంటే బాధనిపించలేదా?

బాధేమీ లేదు. నేను ఉద్యోగంలో ఉన్నా.. ప్రజల్లోనే ఉండేవాడిని. కాళ్లు ఎప్పుడూ నేల మీద ఉండేవి. అందుకే నాకేమీ అనిపించలేదు. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై నాకు ఆసక్తి. ఉద్యోగంలో చేరినా గ్రామాలకు బాగా వెళ్లేవాడిని. రైతులతో మాట్లాడేవాడిని. మహారాష్ట్రలో కూడా గ్రామాలకు వెళ్లేవాడిని. 2-3 వేల మంది రైతులు చనిపోవడం, గ్రామాలకు వెళ్లితే పరిస్థితులు బాగోలేకపోవడం. మనం ఇలాగే ఉండాలా.. ఏదైనా చేయగలమా అనే ఒక సంకల్పం ఉండేది. నేను ఇక్కడ పనిచేసేప్పుడు కూడా మహబూబ్‌నగర్‌లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. ఒక గ్రామాన్ని ఇలా చేయగలిగాం.. మిగతా గ్రామాల్ని కూడా చేయగలిగే అవకాశం ఉంది కదా అనిపించింది. అప్పుడే ఎన్‌ఐఆర్డీలో డిప్యూడీ డైరెక్టర్‌ జనరల్‌ పోస్టు భర్తీకి ప్రకటన వచ్చింది. దానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. నేనూ వెళ్లాను. ఇంటర్వ్యూలో.. మీరు పోలీసు కదా.. దీనికి మీరేం చేయగలరని అడిగారు. నా అనుభవాలన్నీ చెప్పినా, చివరికి నీవు పోలీసే అన్నారు. తదుపరి ఏడాది మళ్లా నేను అప్లై చేయడం మళ్లీ పోలీస్‌ అంటూ నాకు ఇవ్వకపోవడం జరిగిపోయాయి. దాంతో నా లక్ష్యానికి ఈ పోలీసు ఉద్యోగం అడ్డు వస్తోందనిపించి ఆరోజే నిర్ణయించాను. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేద్దామని ఇంటికి ఫోన్‌ చేసి భార్యకు చెప్పాను. తను కూడా ఓకే అంది. అప్పుడే లెటర్‌ రాసి ఇచ్చి వచ్చేశాను.

 

మీరు సర్వీసులో ఉండే రాజకీయాలను చూశారు కదా..

మహారాష్ట్రలో 21 ఏళ్లు చేశాను కాబట్టి అక్కడ చూడగలిగాను. యశ్వంత్‌రావు చవాన్‌, శంకర్రావు చవాన్‌, విలా్‌సరావు దేశ్‌ముఖ్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌.. వీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు. పల్లెల గురించి బాగా తెలుసు. నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడే రాజకీయం గురించి అనుకోలేదు. ఏపీలో తిరుగుదామనుకున్నాను. 13 జిల్లాల్లో ఐదు నెలలు తిరిగాను. రైతులను కలిశాను. వీరి పరిస్థితి మెరుగుపరచాలంటే.. చిన్న విప్లవం కుదరదు. రాజకీయాల్లోకి వస్తే తప్ప అవదని తిరుపతిలో చెప్పాను.

 

సొంత పార్టీనా లేక ఏదైనా పార్టీలో చేరతారా?

నా భావసారూప్యంతో కనుక ఎవరైనా రాగలిగితే.. వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను.

 

ఎవరైనా వచ్చారా?

ఆమ్‌ ఆద్మీపార్టీ వాళ్లు ఫోన్‌ చేశారు. బీజేపీ నుంచి కూడా ఒకరిద్దరు వచ్చి నాతో మాట్లాడి వెళ్లారు. వాళ్ల దగ్గర నుంచి ఇంకేమీ రాలేదు. ఏపీలో టీడీపీ, వైసీపీ, పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఉన్నాయి. వీటిలో మూడు పార్టీలే మెయిన్‌... నేను వెళ్లి కలవను. వాళ్లెవరూ రాలేదు.

 

సొంతంగా పార్టీపెట్టి నెగ్గుకు రాగలరా?

నేనెప్పుడూ సవాల్‌గా తీసుకొని వెళ్తాను.

 

మీరు పనిచేసినప్పుడు.. ఒత్తిళ్లు ఉండేవి కాదా?

పని ఒత్తిడి ఉండేది కానీ, ఇతరత్రా ఒత్తిళ్లు ఉండేవి కావు. రాజకీయ నాయకులతో పనిచేసే అవకాశం సీబీఐలో లేదు. రంజిత్‌ కుమార్‌ డైరెక్టర్‌ ఉన్నప్పుడు మీపై ఒత్తిళ్లు వచ్చాయని అప్పట్లో రూమర్స్‌ వచ్చాయి. ఆయన ఉన్నప్పుడు నేను ఆరు నెలలు పనిచేశాను. సీబీఐలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పాలనుకున్నామో ఫైల్‌ మీద రాసి పంపిస్తాం. ఒకరితో ఒకరు బ్రీఫింగ్‌లు తీసుకోవడం ఉండదు. ఒత్తిళ్లు పెట్టాలన్నా ఫైల్‌ మీద రాయాల్సిందే. సత్యం కేసు, ఎంఆర్‌ ప్రాపర్టీస్‌ వంటివి చేసినా జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి కేసులు చేపట్టడంతో మీ ఇమేజ్‌ అప్పట్లో ఆకాశానికి వెళ్లిపోయింది. ముఖ్యంగా బళ్లారి అంటే గాలి జనార్దన్‌రెడ్డి సామ్రాజ్యం. అక్కడెవరైనా ఊపిరి పీల్చుకోవాలన్నా వారి అనుమతి తీసుకోవాలి. అలాంటిది మీరు ఇద్దరు ముగ్గురు వెళ్లి పట్టుకొచ్చేశారు నిద్రలేపి తెల్లవారుజామున వెళ్లాం. అప్పుడే లేచారనుకుంటా. ప్రొసీజర్‌ వివరించాం. రెడీ అవడానికి టైమిచ్చి తీసుకొచ్చాం. అప్పట్లో ఆయన చాలా పవర్‌ఫుల్‌ కదా! మాబోటి వాళ్లను కూడా జైలుకు పంపిస్తామన్నాడు. అలాంటి వాళ్లను డీల్‌ చేశారు. అయినా సెక్యూరిటీ వద్దని మీరన్నట్లు గుర్తు. ఆ విధమైన అవసరం ఉందని నాకు అనిపించలేదు.



మీడియాలో చాలా వార్తలు వచ్చేవి. బంగారం కుర్చీ ఉందని. మీరేం చెప్పేవారు కాదు?

అక్కడేమైతే ఉన్నాయో అవి జప్తు చేశాం. కథనాలు చాలా వచ్చాయి. దొరికిన బంగారాన్ని సీజర్‌ చూపించాం. తర్వాత బెయిల్‌ విషయంలో రూ.6 కోట్లు సీజ్‌ చేశాం. అక్కడకు దగ్గరగా ఉన్న మనిషి నుంచి వచ్చింది. బ్యాంకులో డబ్బులు వేశారని చెప్పారు. దాని నుంచి వర్కౌట్‌ చేశాం.

 

అంతంత డబ్బు బెయిల్‌కే ఆఫర్‌ చేశారు కదా? మీకేమీ ఆఫర్‌ చేయలేదా?

ఆ ధైర్యం వారికుందని అనుకోను.

 

రాజకీయ నేపథ్యం ఉండడంతో జగన్‌ కేసు మీకు కష్టమని అనిపించలేదా?

హైకోర్టులో చాలా రోజులు వాదనలు జరిగాయి. ఇది.. మనిషి వచ్చి ఫిర్యాదు చేస్తే చేసిన కేసు కాదు. హైకోర్టులో పిల్‌ వేసి, వాదనలు జరిగి, అమికస్‌ క్యూరీని అపాయింట్‌ చేసి, పూర్తి వాదనలు జరిగిన తర్వాత ప్రాథమిక నివేదిక ఇవ్వమని మమ్మల్ని అడిగారు. సీల్డ్‌ కవర్‌లో రిపోర్ట్‌ ఇచ్చాం. అది చూసిన తర్వాత రెగ్యులర్‌ కేసు నమోదు చేసి విచారణ చేయమని ఆర్డర్స్‌ ఇచ్చారు.

 

మీ నేటివ్‌ కడపా?

అవును. పుట్టింది కడపలో.. పెరిగిందంతా శ్రీశైలంలో.


ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌: చెడు రాజకీయాలకు ప్రత్యామ్నాయం మంచి రాజకీయాలే. దీనికి లక్ష్మీనారాయణగారు సిద్ధపడుతున్నారా అనేది నా ప్రశ్న.

నాకు నచ్చే గొప్ప వ్యక్తుల్లో ఒకరు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌. బురదయ్యా.. ఎందుకు దిగుతావని చాలా మంది అంటున్నారు. బురదని దిగకుంటే.. ఆ బురద ఇంకా కంపు కొడుతుంది. మనం ఉండలేం.


సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు: రాజకీయాల్లోకి రావాలనుకోవడం సంతోషం. ఇబ్బందులు చిన్నగా అర్థం అవుతాయి...

ఆయన(విజయరామారావు) మంత్రిగా చేశారు కాబట్టి.. కచ్చితంగా అనుభవాలు ఉంటాయి.


జగన్‌, జనార్దన్‌రెడ్డి కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసి ఐదేళ్లు దాటిపోయింది. ఇంతవరకూ సీరియస్‌ ట్రయల్‌ మొదలు కాలేదు. ఒకవేళ జగన్‌ సీఎం అయి పదేళ్ల తర్వాత లాలూలా తీర్పొస్తే.

కాల పరిమితితో కూడిన విచారణ చాలా ముఖ్యం. రాజకీయ కేసులను కూడా ఏడాదిలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెబుతోంది. కానీ బ్యాక్‌లాగ్‌ కేసులు చాలా ఉన్నాయి.

 

గాలి విషయంలో కూల్‌గా చేయగలిగారు కానీ, జగన్‌ విషయంలో గొడవలు అవుతాయని తెలియలేదా?

లోకల్‌ పోలీసులకు చెప్పాం. విధుల్లో భాగంగానే చేశాం.

 

మీ మీద రివర్స్‌ కేసులు వేశారు కదా..మీ కాల్‌ లిస్ట్‌ను వాళ్లు పట్టుకుని హైకోర్టులో కేసు వేశారు.

వాళ్లు చేయాల్సింది వారు చేశారు. నా వివరణ ఇచ్చాను.

 

అది నేరం కాదా?

నేను కూడా నా ప్రైవసీపై ఫిర్యాదు చేశాను. మహారాష్ట్రలో కేసు నమోదు చేశారు.

 

మీరు సీబీఐ జేడీగా ఉన్నప్పుడు కాల్‌లిస్ట్‌ కేసు ఇక్కడ జరిగితే మహారాష్ట్రలో ఎందుకు ఫిర్యాదు చేశారు?

కాల్‌ డేటా అక్కడి నుంచి తీసుకున్నారు.

 

బీజేపీ నేత మాధవ్‌: పదవీ విరమణ చేసి మీరు సామాజిక, రాజకీయ రంగంలోకి రావాలని నిర్ణయించడం చాలా సంతోషం. మా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం.

మాధవ్‌గారు నాకు పరిచయం. గుడిలోవలోని స్కూల్‌లో వీళ్లంతా విద్యార్థులు. వీరంతా కలిసి వాళ్ల టీచర్లకు క్వార్టర్స్‌ కట్టించారు. వాటి ప్రారంభోత్సవానికి నేను వెళ్లాను. ఆ విధంగా నాకు మాధవ్‌గారు పరిచయం.

 


సీబీఐలో పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి?

సీబీఐ దేశానికే చెందిన సంస్థ కాదు. ఇంటర్నేషనల్‌ సంస్థ. విజయ్‌ మాల్యాను తీసుకురావాలంటే ఈ సంస్థే చేయాలి. నీరవ్‌ మోదీని, చోక్సీని తీసుకురావాలన్నా వీరిదే పని. దావుద్‌ను పట్టుకు రావాలన్నా ఈ సంస్థ ద్వారానే చేయాలి. లండన్‌ కోర్టులో వారు చేస్తున్న వాదనేంటంటే.. మాకు అక్కడ కండిషన్లు బాగుండవు. వ్యవస్థల మీద మాకు నమ్మకం లేదని వాదన చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటివి జరిగితే.. వారి వాదనకు బలమిచ్చినట్లు అవుతుంది. కచ్చితంగా ఇదొక ఆందోళన కలిగించే పరిణామం.

 

2019 లేదా 2024లో అధికారంలోకి రావాలని లేదా?

అధికారం కాదు గానీ, ముఖ్యంగా ప్రజలు స్వేచ్ఛగా ఒక అభిప్రాయం వ్యక్తం చేయగలిగే సమాజాన్ని తీసుకు రాగలిగి, మంచి వాళ్లను ఎన్నుకుందాం అనే మార్పు రాగలిగితే, అటువంటి వారి వాయి్‌సను మనం అసెంబ్లీ, పార్లమెంట్‌లో వినిపించగలిగితే క్షేత్రస్థాయిలో కాకుండా విస్తృతస్థాయిలో మార్పులు వస్తాయనేది నా అభిప్రాయం.

 

మాకు ఫైనల్‌గా క్లారిటీ ఎప్పుడిస్తారు?

త్వరలోనే క్లారిటీ ఇస్తాను. ఫైనల్‌కు వచ్చింది.

 

నెల రోజుల్లోనా?

అంత కూడా అవసరం లేదనుకుంటాను.

 

మీ నిర్ణయానికి మీ బాబు, పాప కూడా ఓకే అన్నారా?

అవును. నేను నిర్ణయం తీసుకునేసరికి బాబుకు ఐపీఎస్‌ సెలక్షన్‌కు రాలేదు. నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత పింఛను వస్తుందని నా పెన్షన్‌ బ్రాంచ్‌ను అడిగాను. లక్షా ఐదువేల రూపాయలు వస్తుందని చెప్పారు. వెంటనే భార్యకు చెప్పాను. ఆమె ఓకే అంది. అమ్మతోనూ సిస్టర్స్‌తోనూ మాట్లాడాను. రెండు మూడు గంటల్లోనే నిర్ణయం తీసుకున్నాను.

 

మీ లక్ష్యం ఏమిటి?

సావర్కర్‌ గురించి చెబుతుంటా.. మనం పుడతాం. ఈ దేహాన్ని సంతరించుకుంటాం. చనిపోయినప్పుడు దేవుడి దగ్గరికెళ్లామంటారు. ఈ దేహం దేవుడి దగ్గరకు వెళ్లిపోవడానికి మధ్య దేశం ఉంటుంది. కాబట్టి ఆ దేశాన్ని గురించి ఏమైనా ఆలోచించమనేది ఆయన మాటలు. దానికి చాలా ప్రభావితమయ్యాను. కలాం గారితో ఉన్న పరిచయం ప్రభావం కూడా ఉంది. మనం కూడా వెళ్లిపోయేముందు గుర్తుండేలా ఏమైనా చేయగలమా అన్నది ఒక సంకల్పం.

 

సో.. మీ వల్ల సమాజానికి, దేశానికి మంచి పనులు జరగాలని కోరుకుంటూ థాంక్యూ.

Updated Date - 2020-02-07T19:46:32+05:30 IST