CBI Investigate: సీబీఐతో విచారణ జరిపించండి
ABN , First Publish Date - 2022-07-27T13:31:41+05:30 IST
అన్నాడీఎంకే కార్యాలయంలో ఈ నెల 11న జరిగిన దాడిలో దుండగులు పలు వస్తువులు, రికార్డులను చోరీ చేసారని, ఈ ఘటనకు సంబంధించి సీబీఐ(Cbi)తో విచారణ
- అన్నాడీఎంకే కార్యాలయంలో చోరీపై డీజీపీకి మాజీ మంత్రి సీవీ షణ్ముగం వినతి
పెరంబూర్(చెన్నై), జూలై 26: అన్నాడీఎంకే కార్యాలయంలో ఈ నెల 11న జరిగిన దాడిలో దుండగులు పలు వస్తువులు, రికార్డులను చోరీ చేసారని, ఈ ఘటనకు సంబంధించి సీబీఐ(Cbi)తో విచారణ జరిపించాలని ఆ పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం(Shanmugam) డీజీపీ శైలేంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లిన షణ్ముగం వినతిపత్రం సమర్పించారు. అన్నాడీఎంకే కార్యాలయం(Office) వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి రాయపేట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మరమ్మతులు ప్రారంభం..
రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్ మాళిగై’లో మరమ్మతు పనులు(Repair works) ప్రారంభమయ్యాయి. ఘర్షణ కారణంగా రెవెన్యూ అధికారులు కార్యాలయానికి వేసిన సీలును ఈపీఎస్ వర్గీయులు హైకోర్టు(High Court)ను ఆశ్రయించి తొలగించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈపీఎస్ వర్గీయుల వశమైన పార్టీ కార్యాలయంలో మరమ్మతులు చేపడతున్నారు. విరిగిన అద్దాలు, బీరువాలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తొలగిస్తున్నారు. అన్ని గదుల్లోనూ కొత్త ఫర్నిచర్ను, కంప్యూటర్లను, బీరువాలను ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఆ మేరకు ఆ సామగ్రిని ఈపీఎస్(EPS) వర్గీయులు కొనుగోలు చేస్తున్నారు. ఆగస్టు 20 తర్వాత పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో ఈపీఎస్ ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో వేగంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు.