CBI Searches : మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్ తనిఖీలు
ABN , First Publish Date - 2022-08-30T17:43:59+05:30 IST
ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలకు పాల్పడినట్లు నమోదైన
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలకు పాల్పడినట్లు నమోదైన కేసులో ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాపై సీబీఐ (Central Bureau of Investigation) దర్యాప్తు జరుగుతోంది. దీనిలో భాగంగా ఆయన బ్యాంకు లాకర్లను మంగళవారం తనిఖీ చేసింది. దీని కోసం ఆయన ఘజియాబాద్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖ వద్దకు చేరుకున్నారు.
ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో దీనిని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో మనీశ్ సిసోడియా నివాసంతోపాటు మరికొన్ని చోట్ల సీబీఐ సోదాలు చేసి, 15 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియా సోమవారం ఇచ్చిన ట్వీట్లో, మా బ్యాంకు లాకర్ను తనిఖీ చేయడానికి సీబీఐ అధికారులు మంగళవారం వస్తారని తెలిపారు. ఆగస్టు 19న 14 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో తన నివాసంలో వారికి ఏమీ దొరకలేదన్నారు. లాకర్లో కూడా ఏమీ దొరకదని తెలిపారు. సీబీఐకి స్వాగతం పలికారు. ఈ దర్యాప్తులో తాను, తన కుటుంబ సభ్యులు సంపూర్ణంగా సహకరిస్తారని చెప్పారు.
ఈ ఎక్సయిజ్ విధానాన్ని అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అనుమతి లేకుండా గత ఏడాది నవంబరులో ప్రవేశపెట్టారని సీబీఐ ఆరోపించింది. లంచాలు తీసుకుని అర్హత లేని మద్యం వ్యాపారులకు అనుమతులు ఇచ్చారని ఆరోపించింది. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఎనిమిది నెలల తర్వాత ఈ విధానాన్ని ఉపసంహరించుకుందని తెలిపింది.