అనిల్ దేశ్‌ముఖ్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ

ABN , First Publish Date - 2022-04-06T23:01:35+05:30 IST

బలవంతపు వసూళ్ల కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను పది రోజుల పాటు..

అనిల్ దేశ్‌ముఖ్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ

ముంబై: బలవంతపు వసూళ్ల కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బుధవారంనాడు ముంబైలోని ఆర్థర్ రోడ్డు  జైలు నుంచే ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో గత నవంబర్ నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.


కాగా, రూ.400 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సీబీఐ ప్రశ్నలకు ఆరోగ్య కారణాల సాకుతో సమాధానాలను అనిల్ దేశ్‌ముఖ్ దాటవేస్తున్నారని దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక కోర్టుకు ఇప్పటికే తెలియజేసింది. అయితే, ప్రత్యేక కోర్టు ముందు హాజరైన సందర్భంగా అనిల్ దేశ్‌ముఖ్ తన వాదనను కోర్టుకు విన్నవించారు. ప్రతీసారి తాను సీబీఐకి సహకరిస్తూనే ఉన్నానని చెప్పారు. తనను ఎప్పుడు పిలిచినా వెళ్తూనే ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. త్వరలోనే తన భుజానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. భుజం డిస్‌లొకేట్ కావడంతో కొన్ని ఎక్సర్‌సైజులు చేయమన్నారని చెప్పారు.  భుజం చాలా నొప్పిగా ఉందని, జేజీ ఆసుపత్రిలో తనకు చికిత్స జరుగుతోందని చెప్పారు.

Updated Date - 2022-04-06T23:01:35+05:30 IST