Delhi tour: నేడు ఢిల్లీకి సీఎం
ABN , First Publish Date - 2022-08-06T16:35:40+05:30 IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) రాష్ట్ర పర్యటన ముగించుకుని వెళ్లిన రెండు రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
- హస్తినలోనే రెండు రోజులు
- మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం
బెంగళూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) రాష్ట్ర పర్యటన ముగించుకుని వెళ్లిన రెండు రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఢిల్లీ వెళుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రి(Chief Minister) ఆదివారం రాత్రి వెనుతిరిగి రానున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో పాల్గొనాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. ఈ మేరకు సీఎం బొమ్మై ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం నీతి ఆయోగ్ సభలో భాగస్వామ్యులవుతారు. రెండు రోజుల పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. అయితే రెండు సభల్లోనూ అగ్రనేతలు పాల్గొంటున్నందున రాష్ట్రంలో నెలల తరబడి పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశం చర్చించే అవకాశం ఉంది. 2021 డిసెంబరుకు ముందే విస్తరణ ఉంటుందని భావించారు. తర్వాత ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీ వెళ్లి నా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాష్ట్రానికి హోంశాఖ మంత్రి(Home Minister) అమిత్షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా పలుమార్లు వచ్చినా ఆ అంశమే తేల్చలేదు. ఇటీవలే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీలో పాల్గొన్న అమిత్ షా విస్తరణ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇలా మరోసారి ముఖ్యమంత్రి రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున అవకాశం లభిస్తే విస్తరణను ఖరారు చేయించే అవకాశం ఉంది. అత్యాచార ఆరోపణల కేసులో రమేశ్ జార్కిహొళికి బి-రిపోర్టు ద్వారా క్లీన్చిట్ లభించడంతో మరోసారి ఆయన కేబినెట్లో చేరే అవకాశం ఉంది. ఇక పంచాయతీరాజ్శాఖ మాజీ మంత్రి ఈశ్వరప్ప వివాదంలోనూ క్లీన్చిట్ లభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరిద్దరినీ కేబినెట్లో చేర్చుకునే అవకాశం ఉంది.