సీసీ కెమెరాల మధ్య Tenth Exams..
ABN , First Publish Date - 2022-05-16T15:20:00+05:30 IST
మరో వారం రోజుల్లో టెన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్లో దాదాపు 2.15
- ప్రశ్నాపత్రం ఓపెన్ నుంచి సీల్ చేసే వరకు..
- ప్రతీ అంశాన్ని రికార్డు చేయనున్న విద్యాశాఖ
- సీసీ కెమెరాలు లేనిచోట్ల అద్దెకు..
హైదరాబాద్ సిటీ : మరో వారం రోజుల్లో టెన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్లో దాదాపు 2.15 లక్షల మంది పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. ఇతర రాష్ర్టాల్లో చోటుచేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా వ్యవహరించనుంది. గతానికి భిన్నంగా అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతీ అంశాన్ని రికార్డు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సీసీ కెమెరాల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అన్ని సెంటర్లలోనూ సీసీ కెమెరాలున్నాయా, పనిచేస్తున్నాయా, లేదా అనే వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు.
941 సెంటర్లు..
పదో తరగతి వార్షిక పరీక్షలను పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 941 సెంటర్లను ఏర్పాటు చేశారు. 604 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలున్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా 337 చోట్ల ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. సీసీ కెమెరాలు లేని సెంటర్లలో అద్దెకు తీసుకుని తక్షణమే ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
ఫుటేజీ విద్యాశాఖ అధికారులకు..
ప్రశ్నాపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్ను అరికట్టడంలో భాగంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయడం ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా చీఫ్ సూపరింటెండెంట్ గదిలో ఉంచడంతోపాటు ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేస్తున్నప్పుడు, సమాధాన పత్రాలను తిరిగి సీల్ చేస్తున్నప్పుడు ప్రతీ ఒక్కటి రికార్డు చేయాలని ఆదేశించారు.
సీసీ కెమెరాను మెయిన్ కెమెరా మానిటర్కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ల మానిటర్లతో జతచేయనున్నారు. పరీక్ష జరిగిన ఆరు రోజుల సీసీ టీవీ ఫుటేజీలను చీఫ్ సూపరింటెండెంట్లు చివరి రోజున సీల్డ్ కవర్లో భద్రపరిచి జిల్లా విద్యాశాఖాధికారులకు అందజేయనున్నారు.