సీలింగ్ భూముల పరిశీలన
ABN , First Publish Date - 2021-05-11T04:48:14+05:30 IST
సీలింగ్ భూముల పరిశీలన
- దేవరయాంజాల్లో మరోసారి పర్యటించిన ఐఏఎస్ల బృందం
- ఎవరి ఆధీనంలో ఉన్నాయనే కోణంలో విచారణ
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి) : దేరవయాంజాల్లోని భూములను ఐఏఎ్సల కమిటీ పునఃపరిశీలించింది. ఇటీవల నాలుగైదు రోజుల పాటు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి ఆలయ భూములపై విచారణ చేపట్టిన ఐఏఎస్ అధికారుల బృందం, సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్రావు నేతృత్వంలో శ్వేతామహంతి, భారతీహొళికేరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐఏఎస్ అధికారులతో పాటు రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు గూగుల్, ఏరియల్ మ్యాప్ల ఆధారంగా భూములను పరిశీలించారు. ఇటీవల దేవరయాంజాల్లోని భూములపై ఐఏఎ్సలతో విచారణకు జారీచేసిన ఉత్తర్వులపై ప్రభుత్వానికి, ఆలయ స్పెషల్ ఆఫీసర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కోర్టుకు సమగ్ర వివరాలతో కౌంటర్ వేసేందుకు మరోసారి భూముల వివరాలు సేకరించినట్టు సమాచారం. దేవరయాంజాల్లో పలు సర్వే నెంబర్లలో దాదాపు 40ఎకరాల వరకు సీలింగ్ భూమి ఉంది. 1975లో ప్రభుత్వం సర్ప్లస్ కింద తీసుకున్నట్టు తెలిసింది. ఈ భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టారు. అట్టి భూములను ఐఏఎ్సల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సీలింగ్ భూముల్లో ఎంతమేరకు ఖాళీ స్థలం ఉంది? ఏమైనా గోదాములు, ఇళ్ల నిర్మాణాలు వంటివి చేపట్టారా? అన్న అంశాలను అధికారులు పరిశీలించారు. సీలింగ్ భూమిని ఎంతమంది రైతుల వద్ద సేకరించారన్న సమగ్ర వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏయే సర్వే నెంబర్లలో ఎంతమేరకు సీలింగ్ భూమి ఉందని, ఈ భూమిలో ఖాళీ స్థలం ఎంత ఉందని పరిశీలించారు. పక్కనే ఉన్నటువంటి ఆంజనేయస్వామి, పెద్దమ్మ ఆలయాలను పరిశీలించారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ వద్ద ఉన్నటువంటి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి దేవరయాంజాల్లో పర్యటించిన సందర్భంలో సీతారామచంద్రస్వామి ఆలయ భూములుగా దేవాదాయ శాఖ పేర్కొన్న వాటన్నింటినీ ఐఏఎ్సల బృందం సమగ్రంగా విచారణ చేపట్టలేదని ఆరోపించారు. సర్వే నెంబర్లు 212 నుంచి 218లో గల భూముల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు లేఔట్ చేసి భూములను విక్రయిస్తున్నారని, నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా రిజిస్ర్టేషన్ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఐఏఎ్సల బృందం సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఉన్నటువంటి దారి గుండా హైదరాబాద్కు వెళ్లింది. ఈ భూములను, ఈ ప్రాంతంలోని నిర్మాణాలను, లేఔట్ను పరిశీలించినట్టుగా సమాచారం. దేవరయాంజాల్లోని భూములపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు.