సిమెంట్, స్టీల్ ధరలను ప్రభుత్వమే నియంత్రించాలి
ABN , First Publish Date - 2021-01-22T05:56:17+05:30 IST
గతంలో ఎన్నడూ లేనంతగా నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు పెరిగిపోయాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని నియంత్రించాలని క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైౖర్మన్ పీలా కోటేశ్వరరావు కోరారు.
క్రెడాయ్ చైర్మన్ పీలా కోటేశ్వరరావు
విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేనంతగా నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు పెరిగిపోయాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని నియంత్రించాలని క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైౖర్మన్ పీలా కోటేశ్వరరావు కోరారు. సిమెంట్ కంపెనీలు కార్టైల్గా బస్తా ధరను రూ.230 నుంచి రూ.400కు పెంచేశాయన్నారు. స్టీల్ ధరలు టన్ను రూ.35 వేల నుంచి రూ.60 వేలుకు చేరిందన్నారు. అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ధరలు పెరగడం వల్ల విశాఖపట్నంలో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకు రూ.200 పెరిగిందన్నారు. వీటి వల్ల అంతిమంగా కొనుగోలుదారులపైనే భారం పడుతోందని చెప్పారు. ఫ్లాట్లకు ముందుగా డబ్బులు చెల్లించిన వారికి ధరలు పెంచలేమని, ఆ నష్టం బిల్డర్లే భరించాల్సి వస్తోందన్నారు. కార్యదర్శి ధర్మేందర్ మాట్లాడుతూ ఇసుకకు టన్ను ఒక్కంటికి ప్రభుత్వం రూ.375 వసూలు చేస్తున్నప్పటికీ అన్ని ఖర్చులు కలిపి నిర్మాణ ప్రాంతానికి వచ్చేసరికి రూ.2 వేలు పడుతోందని చెప్పారు. ఇసుక పాలసీ మంచిదే అయినా దానిని క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. తాము ధరలు పెంచుతున్నామనడంలో అర్థం లేదని, అంతా సిమెంట్ కంపెనీలే చేస్తున్నాయని పేర్కొన్నారు.