నిర్మాణరంగం కుదేలు!
ABN , First Publish Date - 2022-01-08T03:29:32+05:30 IST
గత రెండేళ్లుగా కొవిడ్-19తో అన్ని రంగాలతో పాటు భవన నిర్మాణం కూడా కుదేలైంది. భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధిలేక అల్లాడిపోయారు.
పెరిగిన సిమెంటు ధరలు
పేదలకు మోయలేని భారం
గత వారంలో 20 నుంచి రూ.30 పెంపు
తాజాగా మరో రూ.30 పెరుగుదల
ఉదయగిరి, జనవరి 7: గత రెండేళ్లుగా కొవిడ్-19తో అన్ని రంగాలతో పాటు భవన నిర్మాణం కూడా కుదేలైంది. భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధిలేక అల్లాడిపోయారు. ఇటీవల ఒమైక్రాన్ విజృంభిస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ అన్ని రంగాలు కూడదీసుకుని నెమ్మదిగా నడక ప్రారంభించాయి. పేద, మధ్య తరగతి ప్రజలు కొందరైనా ఇళ్లు కట్టుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో సిమెంటు, ఇటుక, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఒకటో తేదీ నుంచే బస్తాకు రూ.20 నుంచి రూ.30 వరకు కంపెనీలు పెంచేశాయి. దీంతో బస్తా సిమెంటు ధర రూ.320 నుంచి రూ.350 పలుకుతోంది. దానికి తోడు మరో మారు సిమెంటు ధర బస్తాకు రూ.30 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ధరలు రెండు, మూడు రోజుల్లో అమలులోకి రావచ్చు. లేదా పండుగ తర్వాత అమలులోకి రావచ్చు. దీంతో కనీసం ధర రూ.350. గరిష్ట ధర రూ.380 ఉండవచ్చు. ఇక ఐరన్ ధర టన్ను రూ.57 వేలు ఉంది. ఇసుక ధర టన్ను రూ.720 వరకూ ఉంది. ఇవ్వన్నీ నిర్మాణ రంగంపై విపరీతమన ప్రభావాన్ని చూపుతుండడంతో నిర్మాణ రంగం కుదేలైంది.