బీసీలను పట్టించుకోని కేంద్రం: ఆర్.కృష్ణయ్య
ABN , First Publish Date - 2022-07-01T08:39:20+05:30 IST
బీసీలను పట్టించుకోని కేంద్రం: ఆర్.కృష్ణయ్య
నందికొట్కూరు, జూన్ 30: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు బీసీలను విస్మరించాయని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రబ్బాని కాంప్లెక్సు ఆవరణలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును పక్కన పెట్టిందని ఆరోపించారు. బీసీలకు ఇంత వరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖలు లేవన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కోసం పోరాడతామని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్లో రూ.2లక్షల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణయ్యను బీసీ సంఘం నాయకులు సన్మానించారు.