కేసీఆర్ సర్కార్కు చెంప చెళ్లుమనిపించేలా కేంద్రం సమాధానం: విజయశాంతి
ABN , First Publish Date - 2022-03-23T00:45:45+05:30 IST
కేసీఆర్ సర్కార్కు చెంప చెళ్లుమనిపించేలా కేంద్రం సమాధానం: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు.యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై కేసీఆర్ సర్కార్కు చెంప చెళ్లుమనిపించినట్లు కేంద్రం నుంచి సమాధానం వచ్చిందని ఆమె అన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజా కొంటామని కేంద్రం ప్రకటించిందని, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యాసంగి ధాన్యం కొనుగోలుపై మరోసారి స్పష్టతనిచ్చారని విజయశాంతి అన్నారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యత అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారని, రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి విమర్శించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
''యాసంగి ధాన్యం కొనుగొలు విషయమై కేసీఆర్ సర్కార్కు చెంప చెళ్ళుమనిపించినట్లు కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. తెలంగాణలో పండిన ప్రతి గింజా కొంటామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు యాసంగి ధాన్యం కొనుగోలుపై మరోసారి స్పష్టతనిచ్చారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యత అని పీయూష్ గోయల్ గారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. అసలు గతంలో ఇస్తానన్న బియ్యన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వనేలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది కదా? ఇప్పుడొచ్చిన ఇబ్బందేంటో స్పష్టం చేయాలని పీయూష్ గోయల్ గారు అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సమాధానంతోనైనా కేసీఆర్ సర్కార్కు బుద్ధి వస్తుందో లేదో చూడాలి. కేసీఆర్ గతంలో వరి సాగు ముద్దన్న నోటితోనే... ఇప్పుడు వరి వద్దంటూ.. యాసంగిలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని స్వయంగా ప్రకటించారు. పైగా వరి విత్తనాలు విక్రయించకుండా విత్తన కంపెనీలు, డీలర్లకు ఆంక్షలు విధించిన్రు. అయినా రైతులు వరి సాగు మానేది లేదని తెగించి మరీ వరి నాట్లు జోరుగా వేశారు. ఇక సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కూడా వరినే సాగు చేస్తూ రైతులను మాత్రం వరి వేయవద్దని తప్పుదోవ పట్టించిండు. బాయిల్డ్ రైస్ కాకుండా, రా రైస్ కొంటామని కేంద్రం చెప్పినప్పటికీ కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తూ... అసలు కేంద్రం వరి ధాన్యమే కొనడం లేదని.. తప్పుడు ప్రచారాలు చేశారు. ఏడేండ్ల కేసీఆర్ ఏలుబడిలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మూడేండ్లుగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, రైతులను బ్యాంకర్ల వద్ద డిఫాల్టర్లుగా మార్చేసి, బయట అప్పులు తెచ్చుకునేలా చేసి, అప్పుల ఊబిలో పడేసిన ఈ దగాకోరు కేసీఆర్ సర్కార్ను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ రైతాంగం గద్దె దించడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.