వంట గ్యాస్ సబ్సిడీ గాయబ్!
ABN , First Publish Date - 2022-06-03T08:33:39+05:30 IST
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు
సామాన్యులకు కేంద్రం షాక్
ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ ఎత్తివేత
కేవలం ఉజ్వల లబ్ధిదారులకే సబ్సిడీ
మిగిలినవారు మార్కెట్ ధర చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ, జూన్ 2: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పేదలకు మాత్రమే సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది. మిగిలిన వినియోగదారులంతా ఎల్పీజీ సిలిండర్ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం సిలిండర్పై రూ.40 సబ్సిడీ ఇస్తున్నారు. ఇకపై అదికూడా ఉండదు. వంట గ్యాస్ సిలిండర్లపై జూన్ 2020 నుంచే సబ్సిడీ ఇవ్వడం లేదని జైన్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మేరకు ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ ఇస్తామని చెప్పారు. ఉజ్వల లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.6100 కోట్ల భారం పడనుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1003 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. ఆ మొత్తం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.
ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ దక్కనుంది. సాధారణ గృహ వినియోగదారులు ఇకపై మార్కెట్ ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా 30.50 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులున్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మంది సబ్సిడీకి దూరమైనట్లే. 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై సబ్సిడీని ఎత్తివేయగా.. 2014 నవంబరులో డీజిల్పైనా సబ్సిడీని తొలగించారు. రెండేళ్ల తర్వాత కిరోసిన్పై ఇస్తున్న రాయితీనీ నిలిపివేశారు. తాజాగా గ్యాస్పై ఇస్తున్న సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది.