రక్షణ రంగ సంస్థల ప్రదర్శనలకు అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2021-12-14T17:16:37+05:30 IST

ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా నగరంలోని పలు కేంద్రప్రభుత్వ రంగసంస్థలలో ఆయా సంస్థల ప్రగతికి అద్దంపట్టే పలు ఆవిష్కరణలు, నూతన ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి.

రక్షణ రంగ సంస్థల ప్రదర్శనలకు అనూహ్య స్పందన

బెంగళూరు: ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా నగరంలోని పలు కేంద్రప్రభుత్వ రంగసంస్థలలో ఆయా సంస్థల ప్రగతికి అద్దంపట్టే పలు ఆవిష్కరణలు, నూతన ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. కేంద్రప్రభుత్వ రక్షణ సంస్థలైన హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) తదితర సంస్థలలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ రూపంలో కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ హెరిటేజ్‌ సెంటర్‌, ఏరోస్పేస్‌ మ్యూజియంలో ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను సియాటి గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ సీజీ కృష్ణదాసనాయర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పలు నూతన ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. బీఈఎంఎల్‌ నిర్వహణలోని బెంగళూరు, కేజీఎఫ్‌, మైసూరు, పాలక్కాడ్‌ (కేరళ)లోని కాంప్లెక్స్‌లలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంగా సంస్థ తయారు చేసిన మెట్రోరైల్‌ కోచ్‌లు, డంపర్‌లు, డోజర్‌లు, హెవీడ్యూటీ ట్రక్‌లను ప్రదర్శనకు ఉంచారు. బీఈఎంఎల్‌ సీఎండీ అమిత్‌ బెనర్జీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన ఈనెల 19వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు ప్రదర్శనను తిలకించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. 

Updated Date - 2021-12-14T17:16:37+05:30 IST