చైనాలో వైద్యవిద్య చదవాలనుకొనే విద్యార్థులకు కేంద్రం కీలక సూచన.. అక్కడ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ABN , First Publish Date - 2022-09-11T12:59:32+05:30 IST
చైనాలో వైద్యవిద్య చదవాలనుకొనే విద్యార్థులు నీట్-యూజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైద్య విద్యార్థులూ బహుపరాక్!
చైనాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి .. సూచనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
బీజింగ్, సెప్టెంబరు 10: చైనాలో వైద్యవిద్య చదవాలనుకొనే విద్యార్థులు నీట్-యూజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరు మాత్రమే భారత్లో ప్రాక్టీస్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్ష రాయడానికి అర్హులని పేర్కొంది. చైనాలోని మెడికల్ కాలేజీలు విదేశీ విద్యార్థుల నమోదు ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో బీజింగ్లోని భారత దౌత్య కార్యాలయం విద్యార్థులకు తాజాగా కొన్ని సూచనలు జారీ చేసింది. 2015-21 మధ్య ఎఫ్ఎంజీ పరీక్షకు హాజరైన 40,417 మందిలో 6,3867 మంది(16శాతం) మాత్రమే ఉత్తీరత సాధించారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఐదేళ్ల కాలవ్యవధితో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్తో మెడికల్ డిగ్రీలు అందించడానికి చైనా ప్రభుత్వం గుర్తించిన 45 వైద్యకాలేజీల జాబితాను విడుదల చేసింది. భారత విద్యార్థులు ఈ కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని దౌత్య కార్యాలయం సూచించింది. వైద్యవిద్యను చైనా భాషలో బోధించే వర్సిటీల్లో విదేశీ వైద్య విద్యార్థులు చేరకూడదని, ఇంగ్లీష్, చైనా భాషల్లో బోధించే వర్సిటీల్లో చేరడంపైనా నిషేధం విధించినట్లు తెలిపింది. క్లినికల్ సెషన్లకు హాజరయ్యేందుకు ప్రతి విద్యార్థి హెచ్ఎస్కే-4 స్థాయి వరకూ చైనా భాషను నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారికి మెడికల్ డిగ్రీ ప్రదానం చేయబోరని పేర్కొంది.