ఎంఎస్‌పీపై కమిటీకి సభ్యులను సూచించండి... రైతు సంఘాలను కోరిన కేంద్రం...

ABN , First Publish Date - 2021-12-01T17:03:54+05:30 IST

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై ఏర్పాటు

ఎంఎస్‌పీపై కమిటీకి సభ్యులను సూచించండి... రైతు సంఘాలను కోరిన కేంద్రం...

న్యూఢిల్లీ : వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై ఏర్పాటు చేసే కమిటీకి ఐదుగురు సభ్యుల పేర్లను సూచించాలని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను కోరింది. సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు హరీందర్ సింగ్ లఖోవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఐదుగురి పేర్లను సూచించాలని కేంద్రం కోరిందని, ఎవరి పేర్లను సూచించాలో తాము ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. డిసెంబరు 4న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కమిటీ నిర్ణీత కాల వ్యవధిలో పని చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. 


సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హర్యానాలో రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్ సంకేతాలు పంపించారన్నారు. పంజాబ్‌లో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు .అదేవిధంగా రైల్వేలు, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ పోలీసులు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 


మరోవైపు సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి రైతులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించిన వెంటనే రైతులు ఈ సరిహద్దులను ఖాళీ చేసే అవకాశం ఉందని సమాచారం.


Updated Date - 2021-12-01T17:03:54+05:30 IST