దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం: పవార్

ABN , First Publish Date - 2021-10-13T21:02:11+05:30 IST

రాజకీయాల కోసం సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్, ఈడీ, ఎన్‌సీబీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఎన్‌సీపీ చీఫ్..

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం: పవార్

ముంబై: రాజకీయాల కోసం సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్, ఈడీ, ఎన్‌సీబీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ యాంటీ-నార్కోటిక్స్ సెల్స్ నిజాయితీగా, ముక్కుసూటి పద్ధతిలో విధులను నిర్వహిస్తోందని, ఎన్‌సీబీతో పోల్చుకుంటే పెద్ద మొత్తాల్లోనే మాదక ద్రవ్యాలను స్వాధీన చేసుకున్న సందర్భాలున్నాయని అన్నారు. పేరున్న వ్యక్తులను (హై ప్రొఫైల్) ఎన్‌సీబీ అరెస్టు చేయడాలు చూస్తుంటే కేంద్రం ఏదో చేస్తోందనే అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు.


ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండే గురించి మీడియా అడిగిన ప్రశ్నకు పవార్ సమాధానమిస్తూ, వాఖెండే గురించి అధికారుల నుంచి సమాచారం కోసం ప్రయత్నిస్తున్నానని, ఆయనను ఇంతకుముందు ఎయిర్‌పోర్ట్ వద్ద పోస్టింగ్ ‌చేశారని చెప్పారు. ఏవోవో విషయాలు తనకు తెలుస్తున్నప్పటికీ పూర్తి సమాచారం తనవద్ద లేనందున దానిపై మాట్లాడనని అన్నారు. వివిధ కేసుల్లో ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయని అన్నారు. చిన్నచిన్న ప్లాకెట్లు లేదా గ్రాముల్లోనే వాళ్లు పట్టుకున్నారని చెప్పారు.


చైనాతో 13వ విడత చర్చలపై కూడా పవార్ మాట్లాడుతూ, చర్చలు ఫలవంతం కాకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఇదే తరుణంలో కశ్మీర్‌లో ఐదుగురు సైనికులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఈ అంశాలపై తాము ఢిల్లీలోని పార్టీలతోనూ, కేంద్రంతోనూ మాట్లాడుతూనే ఉన్నామని, కొద్దిసేపటి క్రితమే రక్షణ విషయాలపై రాజ్‌నాథ్ సింగ్,  చైనా సరిహద్దు అంశంపై ఏకే ఆంటోనీ తనతో సంభాషించారని అన్నారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు, విభేదాలకు తావులేదని పవార్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-13T21:02:11+05:30 IST