మూక దాడులపై గణాంకాలు అందుబాటులో లేవు : కేంద్రం

ABN , First Publish Date - 2021-12-15T22:40:47+05:30 IST

మూక దాడుల్లో మరణించిన లేదా గాయపడినవారి వివరాలను

మూక దాడులపై గణాంకాలు అందుబాటులో లేవు : కేంద్రం

న్యూఢిల్లీ : మూక దాడుల్లో మరణించిన లేదా గాయపడినవారి వివరాలను విడిగా నమోదు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది. ఇటువంటి దాడులను నిరోధించే లక్ష్యంతో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది. వదంతులు ప్రచారం కాకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వీస్ ప్రొవైడర్లను అప్రమత్తం చేసినట్లు పేర్కొంది. 


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, మూక దాడుల్లో మరణించిన లేదా గాయపడినవారి సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రత్యేకంగా నిర్వహించడం లేదన్నారు. మూక దాడుల జాఢ్యాన్ని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామూహిక హింస, మూక దాడులను ప్రేరేపించే విధంగా వదంతులు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరినట్లు చెప్పారు. 


మూక దాడులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 2019 జూలై 23, సెప్టెంబరు 25 తేదీల్లో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. భారత శిక్షా స్మృతి, ప్రత్యేక చట్టాలు, స్థానిక చట్టాల ప్రకారం వివిధ నేరాల శీర్షికల క్రింద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అందజేసిన సమాచారాన్ని ఎన్‌సీఆర్‌బీ ప్రచురిస్తుందని వివరించారు. మూక దాడుల్లో మరణించిన లేదా గాయపడినవారి సమాచారాన్ని విడిగా ఎన్‌సీఆర్‌బీ నిర్వహించడం లేదని తెలిపారు. 


Updated Date - 2021-12-15T22:40:47+05:30 IST