రైతులను కేంద్రం దేశానికి శత్రువులుగా చూస్తోంది: హర్‌సిమ్రత్ కౌర్

ABN , First Publish Date - 2020-11-27T02:09:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతులను దేశానికి శత్రువుల్లా చూస్తోందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏ‌డీ) నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు.

రైతులను కేంద్రం దేశానికి శత్రువులుగా చూస్తోంది: హర్‌సిమ్రత్ కౌర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను దేశానికి శత్రువుల్లా చూస్తోందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏ‌డీ) నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీవైపు వస్తున్న రైతులను నిలువరించేందుకు బలగాలను ఉపయోగించడంపై బాదల్ మండిపడ్డారు. మోదీ కేబినెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా వ్యవహరించిన హర్‌సిమ్రత్ కౌర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ ఏడాది సెప్టెంబరులో రాజీనామా చేశారు. రైతులతో ఘర్షణ పడే విధానం కేంద్రానికి మంచిది కాదని, వారి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని బాదల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 


రాజ్యాంగ దినోత్సవం నాడు రైతులపై బలగాలను ప్రయోగించారని, దేశంలోని అన్నదాతలకు ఇది ‘బ్లాక్ డే’ అని బాదల్ పేర్కొన్నారు. రైతులను ఈ ప్రభుత్వం దేశానికి శత్రువులుగా భావిస్తోందని, ఆసియాడ్ గేమ్స్ సమయంలోనూ తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, గేమ్స్‌ కోసం ఢిల్లీ వెళ్తున్న పంజాబీలను ఆపేశారని గుర్తు చేశారు. ఇటువంటి అణచివేత వ్యూహాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ప్రభుత్వాన్ని బాదల్ హెచ్చరించారు.   

Updated Date - 2020-11-27T02:09:33+05:30 IST