మోదీ నినాదాల్లో జోరు.. పథకాల్లో లేదు

ABN , First Publish Date - 2022-08-18T04:36:56+05:30 IST

నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నినాదాలతోనే కాలం సరిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించి సీపీఐ 3వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక నినాదాల జోరు పెరిగిందని.. పథకాల అమలు అధ్వానంగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ, విద్యుత్‌ రంగాలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలను దూరం చేయడానికే మోదీ ఉచితాలు వద్దంటున్నారని ఆరోపించారు.

మోదీ నినాదాల్లో జోరు.. పథకాల్లో లేదు
సీపీఐ జెండా ఆవిష్కరణలో చాడ వెంకటరెడ్డి, మంద పవన్‌ తదితరులు

మునుగోడులో బీజేపీ ఓటమే లక్ష్యం

కార్యకర్తలతో చర్చించాక  ఉప ఎన్నికలో పొత్తులపై నిర్ణయం

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి


సిద్దిపేట అర్బన్‌, ఆగస్టు 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నినాదాలతోనే కాలం సరిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించి సీపీఐ 3వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక నినాదాల జోరు పెరిగిందని.. పథకాల అమలు అధ్వానంగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ, విద్యుత్‌ రంగాలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలను దూరం చేయడానికే మోదీ ఉచితాలు వద్దంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను, సబ్సిడీలను రద్దుచేస్తే రైతు ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు రూ.లక్షల కోట్ల రుణాలనుమాఫీచేస్తూ.. పేదల పథకాలను మాత్రం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో మతోన్మాదం, నియంతృత్వం పెరిగిపోతున్నదని విమర్శించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా.. దేశంలో పేదరికం తొలగిపోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న సురాజ్యం రాలేదని అన్నారు. 


తప్పులతడకగా ధరణి

ధరణి పోర్టల్‌లో ఉన్నన్ని లొసుగులు ఎందులోనూ లేవని ఆయన ఎద్దేవా చేశారు. ధరణి అంటేనే తప్పుల తడక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మునుగోడులో ఐదుసార్లు సీపీఐ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే అక్కడ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి భవిషత్‌ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం సీపీఐ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్‌, నాయకులు వెంకట్‌రామ్‌రెడ్డి, బన్సీలాల్‌, లక్ష్మణ్‌, శంకర్‌, మన్నెకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T04:36:56+05:30 IST