సమస్యలు పరిష్కరించకపోతే ఎలా?
ABN , First Publish Date - 2021-10-27T05:07:51+05:30 IST
సభ్యులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించకపోతే సభపై నమ్మకం ఉండదని, వారు సభకు ఎందుకు వస్తారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ప్రశ్నించారు.
- కాంట్రాక్టర్లతో పని చేయించలేరా?
- అధికారులను ప్రశ్నించిన చైర్పర్సన్ సరిత
- వాడీవేడిగా జిల్లా పరిషత్ సమావేశం
గద్వాల రూరల్, అక్టోబరు 26 : సభ్యులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించకపోతే సభపై నమ్మకం ఉండదని, వారు సభకు ఎందుకు వస్తారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ప్రశ్నించారు. సభలో చర్చకు వచ్చిన సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాల్సిం దేనని అధికారులను హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ సరిత మా ట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేసినా అధికారుల అసమర్థతతో పెండింగ్లో పడుతున్నాయని విమర్శించారు. దీని వలన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్వక్తం చేశారు. మండల సర్వ సభ్య సమావేశాలకు అధికారులు రావడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినా పట్టిం చుకోవడం లేదని ఆరోపించారు. అలాంటప్పుడు సభలు, సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. గత సమావేశంలో సభ్యులు పలు సమస్యలను లేవనెత్తా రని, ఈ సమావేశంలో వాటికి పరిష్కారం చూపించిన తర్వాతనే సమీక్ష ఉంటుందని తెలిపారు. పలు శాఖల అధికారుల పనితీరుతో పనులు పెండింగ్లో పడుతు న్నాయని, ప్రధానంగా ఆర్అండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల్లో సమస్యలు పరిష్కారం కావ డం లేదని అన్నారు. ఆర్అండ్బీ శాఖలో రోడ్ల నిర్మా ణాలు పెండింగ్లో ఉండటంతో ప్రమాదాలు జరుగు తున్నాయని చెప్పారు. ఐదేళ్లు గడుస్తున్నా అయిజ - రాజాపూర్ తదితర రోడ్లు పూర్తి కాకపోతే అధికారులు కాంట్రాక్టర్లతో ఏం పనులు చేయిస్తున్నారని ప్రశ్నిం చారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. సభ్యులు ప్రస్తావించిన విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఈని కోరా రు. ఎస్ఈ స్పందించి నట్లుగా ఏఈలు స్పందించడం లేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. మండల సమావేశాలకు ఏఈలు రావడం లేదని, వారిపై కలెక్టర్ ద్వారా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్లో వెనకబడి ఉన్నామని, దానిని వేగవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులు వైద్యసిబ్బందికి సహకరించాలని కోరారు. మరో వారం రోజుల్లో పిల్లల వ్యాక్సిన్ వస్తుందని, వైద్య సిబ్బంది బిజీ అవుతారని గుర్తు చేశారు. అప్పటిలోగా పెద్ద వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సమాధానం చెప్పలేకపోయిన అధికారులు
ఆర్అండ్బీ సమీక్ష సందర్భంగా సభ్యులు లేవ నెత్తిన సమస్యలకు అధికారులు సమాధానం చెప్ప లేకపోయారు. నాలుగు మండలాలకు ఇటిక్యాల మండల కేంద్రంతో లింక్ ఉందని, నాలుగు ఏళ్లుగా రోడ్డు నిర్మాణం పెండింగ్లో ఉందని జడ్పీటీసీ హనుమంతురెడ్డి ప్రశ్నించారు. అయిజ - రాజాపూర్ రోడ్డును కంకర పరిచి వదిలేశారని, ఇప్పుడు ఆ కంకర కూడా నుసిగా మారిందని, తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అయిజ ఎంపీపీ నాగేశ్వర్రెడ్డి ఆవేదన వ్వక్తం చేశారు. అయిజ - వేణిసోంపురం, అయిజ - బింగిదొడ్డి రోడ్ల నిర్మాణం మధ్యలోనే ఎందుకు నిలిచిపోయిందని గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి నిలదీశారు. మిట్టదొడ్డి - రాయిచూర్ రోడ్డు అధ్వానంగా మారిందని గట్టు ఎంపీపీ విజయ్ ప్రస్తావించారు. గద్వాల మండలంలో అర్అండ్బీ ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతు చేయించాలని ఎంపీపీ ప్రతాప్ గౌడ్ కోరారు. వీటిపై సంబంధిత శాఖ అధికారి జవాబు చెప్పకపోవడంతో చైర్పర్సన్ ఆగ్రహం వ్వక్తం చేశారు. విద్యుత్ శాఖ సమీక్ష సమయంలో రైతులు డీడీలు కట్టి మూడేళ్లు గడిచినా ట్రాన్స్ఫార్మర్లు రావడం లేదని గట్టు, రాజోలీ ఎంపీపీలు, ధరూర్, రాజోలి, కేటీదొడ్డి జడ్పీటీసీ సభ్యులు చెప్పారు. మంజూరైన ట్రాన్స్ ఫార్మర్లకు మెటీరియల్ ఇవ్వడం లేదని, రైతులతో కొనుగోలు చేయిస్తున్నారని విమర్శించారు. వచ్చిన మెటీరియల్ ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని, స్వయంగా నాకే ఆ అనుభవం ఎదురైందని ధరూర్ జడ్పీటీసీ సభ్యుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఎస్ఈ హామీ ఇచ్చారు. కేటీదొడ్డికి హెల్త్ సబ్సెంటర్, డాక్టర్లు కావాలని జడ్పీటీసీ సభ్యుడు కోరారు. మల్దకల్ సబ్సెంటర్ చైర్మన్ అయిన నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుం డానే సంతకాలు తీసుకుపోతున్నారని ఎంపీపీ రాజా రెడ్డి సభ దృష్టికి తీసుకవచ్చారు. పల్లె దవాఖాన నిర్మాణాలను వేగవంతం చేయాలని సభ్యులు కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, సీఈవో విజయానాయక్, డిప్యూటీ సీఈవో మసాయిదాబేగం, వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.