నేడే చిట్కుల్లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2022-09-26T04:52:57+05:30 IST
చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా చిట్కుల్ గ్రామం గులాబీ మయంగా మారింది.
పటాన్చెరు రూరల్, సెప్టెంబరు 25 : చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా చిట్కుల్ గ్రామం గులాబీ మయంగా మారింది. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి రజక సంఘం నాయకులతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రముఖులు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను చిట్కుల్ సర్పంచ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వేదిక ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోనే అతి పెద్దదైన చాకలి ఐలమ్మ విగ్రహప్రతిష్ఠ, తొలి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన నీలం మధు ముదిరాజ్ను పలువురు రాష్ట్ర స్థాయి రజక సంఘం నాయకులు ఆదివారం కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిట్కుల్ గ్రామంలో ఈ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా జరుగుతున్న తెలంగాణ ధీరవనిత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీసీ నేతలంతా ఐక్యంగా హాజరవుతున్నారని, ఇటువంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నీలం మధు ముదిరాజ్ను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించగలరని ఈ సందర్భంగా రజక సంఘం నేతలు తెలిపారు.