రామాలయం నిర్మాణానికి విరాళాలు రూ.100 కోట్లు : చంపత్ రాయ్

ABN , First Publish Date - 2021-01-17T20:04:26+05:30 IST

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు

రామాలయం నిర్మాణానికి విరాళాలు రూ.100 కోట్లు : చంపత్ రాయ్

న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. 


సేకరించిన విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారం ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి చేరవలసి ఉందని చంపత్ రాయ్ చెప్పారు. కార్యకర్తలు తెలిపిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.100 కోట్లు వచ్చినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. 


శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని జనవరి 15 నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27 వరకు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ట్రస్టును అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రూ.5,00,100 విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి విరాళం ఇవ్వడంపై కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంపత్ రాయ్ మాట్లాడుతూ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ భారతీయుడని, భారతీయ ఆత్మ శ్రీరామచంద్రుడని అన్నారు. ఈ గొప్ప లక్ష్యం కోసం విరాళం ఇవ్వగలిగినవారు ఇవ్వవచ్చునని, దీనిలో తప్పేమీ లేదని అన్నారు. రామాలయం నిర్మాణం 39 నెలల్లో పూర్తవుతుందని, బహుశా 2024కు ముందే పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. 


Updated Date - 2021-01-17T20:04:26+05:30 IST