చాణక్య నీతి: ఏ సమస్య ఎదురైనా భయపడి, వణికిపోయే బదులు ఈ ఒక్క పని చేయండి చాలు.. వెంటనే కొండంత ధైర్యం వస్తుంది..
ABN , First Publish Date - 2021-10-11T12:10:42+05:30 IST
విజయం సాధించాలనుకునేవారు ఎవరైనా సరే...
విజయం సాధించాలనుకునేవారు ఎవరైనా సరే ఆచార్య చాణక్య తెలిపిన నీతి సూత్రాలు పాటించడం ఎంతో అవసరం. చాణక్య నీతి సూత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాడు చాణక్యుడు చెప్పిన అమూల్యమైన విషయాలు ఈ ఆధునిక కాలంలోనూ మనిషి తన జీవితంలో విజయవంతం కావడానికి ప్రేరణ కలిగిస్తున్నాయి. ఆచార్య చాణక్య భారతదేశంలోని ఉత్తమ పండితులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆచార్య చాణక్య అర్హత కలిగిన అధ్యాపకుడు. నాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తక్షశిల విశ్వవిద్యాలయంతో మంచి అనుబంధం కలిగిన పండితుడు. చాణక్య తన జీవితకాలంలో పలు శాస్త్రాలపై అధ్యయనం చేశారు. ఆచార్య చాణక్య అర్థశాస్త్రాన్ని చాలా లోతుగా చదివినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతేకాకుండా ఆచార్య చాణక్యకు దౌత్యం, రాజకీయ శాస్త్రం, సైనిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలపై మంచి పరిజ్ఞానంతో పాటు లోతైన అవగాహన కూడా ఉంది. చాణక్యుడు తన అనుభవం, పరిజ్ఞానం నుంచి గ్రహించిన సమాచారాన్ని తన ప్రసిద్ధ పుస్తకం చాణక్య నీతి ద్వారా ప్రజలకు అందించారు.
చాణక్య నీతిలో.. జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొనాలో వివరంగా తెలియజేశారు. భయం కలిగినవారు తమ మనస్సులో పరిపరి విధాలుగా ఆలోచిస్తారని, సమస్యలు తలెత్తినప్పుడు భయంతో వణికిపోతారని చాణక్య తెలిపారు. అలాగే త్వరగా సహనం కోల్పోయేవారు కూడా ఏ పనిలోనూ విజయం సాధించలేరని చాణక్య తెలిపారు. సమస్య ఎదురైనపుడు ఇటువంటి భావనలకు విరుద్ధంగా, పూర్తి ఉత్సాహంతో దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమై, తనకు ఎదురైన తగిన సవాలుగా స్వీకరించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇలా ప్రయత్నించేవారి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆచార్య చాణక్య స్పష్టం చేశారు.
ఆచార్య చాణక్య నీతి ప్రకారం, ఎవరైనా సరే తనపై సమస్యలు ఆధిపత్యం వహించడానికి అవకాశం ఇవ్వకూడదు. సమస్యల గురించి నిత్యం మాట్లాడే మనుషుల మధ్య ఉండే కన్నా, వాటికి పరిష్కారాల గురించి మాట్లాడే మనుషుల మధ్య ఉండటం ఉత్తమమని ఆచార్య చాణక్య సూచిస్తున్నారు. సమస్యలకు పరిష్కారం వెదికే వారిపై భగవంతుని కృప ఉంటుందని చాణక్య తెలిపారు. విజయం సాధించడంలో సానుకూల ఆలోచనలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆచార్య చాణక్య తెలిపారు. సమస్యల్లో మునిగితేలేవారు నిత్యం అసంతృప్తితో ఉంటారని, అలాంటి వారు ఎప్పటికీ విజయం సాధించలేరని ఆచార్య చాణక్య తెలిపారు.