చాణక్య నీతి: వృద్ధాప్యంలో భార్య మృతి దేనికి సంకేతం? ఇతరులపై ఆధారపడే వ్యక్తి ఏమి కోల్పోతాడు? మన డబ్బు శత్రువుల చేతికి చిక్కితే..
ABN , First Publish Date - 2021-12-09T12:24:51+05:30 IST
ఆచార్య చాణక్యుని ఆలోచనలు ఎంతో భిన్నంగా..
ఆచార్య చాణక్యుని ఆలోచనలు ఎంతో భిన్నంగా, ఉన్నతంగా కనిపిస్తాయి. చాణక్య తన చిన్న వయస్సులోనే వేదాలను, పురాణాలను ఔపాసన పట్టాడు. తన సమర్థవంతమైన రాజకీయ వ్యూహాలతో ఒక సాధారణ పిల్లవాడిని... చంద్రగుప్త మౌర్యగా, చక్రవర్తిగా తీర్చిదిద్దాడు. తాను రచించిన పలు పుస్తకాల్లో మనిషి జీవితంతో ముడిపడిన పలు అంశాలను వివరించారు ఆచార్య చాణక్య.
ఈ పుస్తకాలు మనిషి విజయం సాధించడానికి సరైన మార్గాన్ని సూచిస్తాయి. పరిస్థితులు అనుకూలించనపుడు.. చెడు సమయం వచ్చినపుడు మనిషి ఎలా మెలిగితే ఆ పరిస్థితుల నుంచి బయటపడగలడో ఆచార్య తన చాణక్య నీతిలో తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి తన భార్య చనిపోతే, రెండవ వివాహం చేసుకోవచ్చు. అయితే వృద్ధాప్యంలో భార్య మరణం అతని దురదృష్టానికి కారణమవుతుందని చాణక్య వ్యాఖ్యానించారు.
ఏ వ్యక్తీ మరొకరిపై ఆధారపడకూడదని, వేరొకరిపై ఆధారపడితే వారి జీవితం నరకం అవుతుందని ఆచార్య చాణక్య హెచ్చరించారు. ఇతరులపై ఆధారపడే వ్యక్తికి ఎలాంటి స్వేచ్ఛ లభించదని చాణక్య తెలిపారు.
ఎవరైనా అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తే, వారికి డబ్బు ప్రాముఖ్యత తెలియదని అర్థం. అలాంటి వారి స్వభావం అహంకారంతో ఉంటుందని చాణక్య పేర్కొన్నారు. వారు ఎవరినీ గౌరవించరన్నారు. ఇటువంటివారు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, వారికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని చాణక్య తెలిపారు.
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తాను సంపాదించిన డబ్బు శత్రువుల చేతుల్లోకి వెళితే, అతనికి రెండురకాల నష్టాలు ఎదురవుతాయి. ఒకటి.. అతని డబ్బు తిరిగి అతని చేతికి అందదు. మరొకటి శత్రువు బలం పెరగడానికి అది ఉపయోగపడుతుందని చాణక్య హెచ్చరించారు.
కొన్ని లక్షణాలు ఎవరి నుంచీ నేర్చుకోనవసరం లేదని చాణక్య తెలిపారు. అవి మన మనసులోంచి వస్తాయి. ఎవరికైనా సహాయం చేయడానికి, ఇతరులకు సేవ చేయడానికి లేదా ఏది తప్పు? ఏది ఒప్పు అనేది నిర్ణయించడాన్ని ఎవరూ బోధించరని చాణక్య తెలిపారు.
చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మనసులో పాపం, దురాశ ఉన్న మనిషి బయటకు మంచివానిగా కనిపించినా.. సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయట పడుతుంది. అలాంటి వ్యక్తులను గమనించి వారికి దూరంగా ఉండటం చాలా ఉత్తమమని చాణక్య సూచించారు.