చాణక్య నీతి: ఆ లక్షణం ఉన్నవారితో అస్సలు స్నేహం వద్దు.. లేదంటే తర్వాత పశ్చాత్తాప పడతారు!
ABN , First Publish Date - 2021-12-18T11:40:29+05:30 IST
ఆచార్య చాణక్యుని విధానాలు, ఆలోచనలు చాలా మందికి..
ఆచార్య చాణక్యుని విధానాలు, ఆలోచనలు చాలా మందికి కఠినంగా కనిపిస్తాయి. కానీ చాణక్యుని మాటలు జీవిత సత్యాలు. చాణక్యుని బోధనలు.. మనిషి ఎదుగుదలకు, జీవితంలోని ప్రతి దశలో తారసపడే శత్రువులతో పోరాడటానికి సహాయపడతాయి. ఆచార్య చాణక్య వెలిబుచ్చిన ఆలోచనలలో.. స్నేహం గురించి ఆయన ఏమన్నారో తెలుసుకుందాం. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం స్నేహితులను ఎంపిక చేసుకునేముందు బాగా ఆలోచించాలి.
నిజమైన స్నేహానికి అర్థం తెలిసిన స్నేహితుడు మీకు హితునిగా ఉంటాడు. చేదు నిజాన్ని కూడా మీకు నిర్భయంగా చెబుతాడు. ఇటువంటి వ్యక్తితో స్నేహం దీర్ఘకాలం కొనసాగుతుంది. కొంతమంది అబద్ధాలు చెప్పి స్నేహితులుగా మారుతారు. వీరికి అది చిన్న అబద్ధమే అనిపిస్తుంది. కానీ నిజం తెలిస్తే వారితో స్నేహం విచ్ఛిన్నమవుతుంది. అబద్ధాల పునాది ఎప్పుడూ బలహీనంగా ఉంటుంది. అబద్ధాలతో ఏర్పడే సంబంధాలు బలహీనంగా ఉంటాయి. అవి చిన్నపాటి కుదుపుతో తెగిపోతాయి. నిజమైన స్నేహం గురించి తెలిసినవారు తోటి స్నేహితులతో అస్సలు అబద్ధం చెప్పకూడదు. అటువంటి అబద్ధాలు మిమ్మల్ని ఆ క్షణంలో సంతోషపెట్టవచ్చు. కానీ తరువాత అవి నిరాశను కలిగిస్తాయి. అందుకే ఆచార్య చాణక్య.. అబద్ధాలు చెప్పే వ్యక్తితో ఎన్నడూ స్నేహం చేయకూడదని తెలిపారు. అబద్ధం చెప్పే వ్యక్తి పక్కన ఉంటే అది ఎన్నటికైనా ప్రమాదకరమని చాణక్య స్పష్టం చేశారు.