చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో 'ఆప్' విజయకేతనం
ABN , First Publish Date - 2021-12-27T21:07:18+05:30 IST
అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. తొలిసారిగా..
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. తొలిసారిగా ఈ ఎన్నికల్లో అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 35 మున్సిపల్ కార్పొరేషన్ సీట్లలో 14 కైవసం చేసుకుంది. గత పర్యాయం 20 సీట్లు గెలుచుకున్న బీజేపీని వెనక్కి నెట్టేసింది. బీజేపీ ఈసారి 12 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ ఒక సీటుకు పరిమితమైంది. బీజేపీ సిట్టింగ్ మేయర్ రవికాంత్ శర్మవాస్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన అనూహ్య ఫలితాలపై 'ఆప్' సంబరాలు చేసుకుంటోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది 'ట్రయిలర్' అని ఆ పార్టీ అభివర్ణించింది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయాన్ని 'మార్పునకు సంకేతం'గా ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
''చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం పంజాబ్లో చోటుచేసుకోనున్న మార్పులకు సంకేతం. అవినీతి రాజకీయ నాయకులను చండీగఢ్ ప్రజలు తోసిపుచ్చి, ఆప్ నిజాయితీ రాజకీయాలకు పట్టంకట్టారు. విజేతలకు, ఆప్ కార్యకర్తలకు అభినందనలు'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.