వైసీపీది ప్రజా ద్రోహం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-10-27T17:13:00+05:30 IST

ప్రజాస్వామ్య బద్ధంగా తలపెట్టిన హంద్రీ-నీవా పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని ప్రతిపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు..

వైసీపీది ప్రజా ద్రోహం: చంద్రబాబు

కుప్పం బ్రాంచి కెనాల్‌ పూర్తి చేసేదాకా స్థానికంగా పోరాటం

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం


కుప్పం: ప్రజాస్వామ్య బద్ధంగా తలపెట్టిన హంద్రీ-నీవా పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని  ప్రతిపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అన్నారు. రైతులకు మేలు చేసే ఏ పోరాటానికైనా ఆటంకం కలిగించడం ప్రజా ద్రోహమే అవుతుందన్నారు. చిత్తూరు జిల్లాపై ముఖ్యమంత్రి జగన్‌ కక్ష పెంచుకున్నారని, ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలే బహిర్గతపరచి భగ్నం చేస్తారని హెచ్చరించారు. కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులు పూర్తిచేసేదాకా స్థానికంగా పోరాటాన్ని ఆపొద్దని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ సోమవారం తలపెట్టిన హంద్రీ-నీవా పాదయాత్రను వైసీపీ పోటీ ర్యాలీలు, నేతల హౌస్‌ అరెస్టులతో భగ్నం చేసిన తర్వాత సాయంత్రం విజవాడనుంచి చంద్రబాబు, కుప్పం టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహిం చారు.


ఆయన మాటల్లోనే..  ‘ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. రౌడీయిజం, గూండాయిజాలకు పాల్ప డుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై తప్పుడు కేసులు పెట్టి వేధి స్తోంది.  రైతులు, పేదల సమస్య లపై పోరాడటం ప్రతిపక్షంగా టీడీపీ బాధ్యత. ప్రతిపక్షం ఆందోళనలకు పోటీ అందోళనలు వైసీపీ జరపడం సిగ్గుచేటు. కుప్పంలో అభివృద్ధి పనులను నిలిపివేయడం ద్వారా ప్రజల్లో నాపై వ్యతిరేకత పెంచాలనుకుంటున్న వైసీపీ కుట్రలను ప్రజలే భగ్నం చేస్తారు. హంద్రీ-నీవా సహా నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేలా వైసీపీ ప్రభుత్వంపై వొత్తిడి తేవాలి. కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులు పూర్తి చేసేదాకా స్థానికంగా పోరాడాలి’ అని చంద్రబాబు కుప్పం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అంతకుముందుకూడా ఆదివారం రాత్రినుంచి సోమవారం మధ్యాహ్నం దాకా నియోజకవర్గ ముఖ్య నాయకులకు ఫోన్లు చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. మరోవైపు పలు ఛానళ్లకు ఫోన్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు ఇస్తూ, హంద్రీ-నీవా పనులు పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. 

Updated Date - 2020-10-27T17:13:00+05:30 IST