వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-28T20:44:00+05:30 IST

వైఎస్ వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు: చంద్రబాబు

అమరావతి: వైఎస్ వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని, బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారన్నారు.  హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే... ఏమవుతుంది?... 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.


వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న సీఎం జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరనేది ఇప్పుడు తేలిపోయిందన్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఆనాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.... ఇప్పుడు సిబిఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.... ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్మి హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా? అన్నారు.


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధుల బాధలు కలిచివేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అప్పుడే వంటింటి నూనె ధరలు పెంచేశారని, రానున్న రోజుల్లో ఇవి మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం, జిల్లాల విభజన విషయంలో శాస్త్రీయత అనేది లేదని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2022-02-28T20:44:00+05:30 IST