ఏపీలో జరుగుతున్న అన్ని తప్పులకు నేనే కారణమంటా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-04T19:36:02+05:30 IST

ఏపీలో జరుగుతున్న అన్ని తప్పులకు తానే కారణమంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో జరుగుతున్న అన్ని తప్పులకు నేనే కారణమంటా?: చంద్రబాబు

అమరావతి: ఏపీలో జరుగుతున్న అన్ని తప్పులకు తానే కారణమంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి గుండెపోటు అని ప్రచారం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పి వైసీపీని ఓడిస్తామన్నారు. సానుభూతితో జగన్‌ ఓట్లు వేయించుకున్నారన్నారు. వివేకా హత్య, కోతి కత్తితో సానుభూతి పొందారని, ఇప్పుడు కోడి కత్తి ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


పోలవరాన్ని పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదన్నారు. అవినీతి, అబద్దాల పుట్టా వైసీపీ అని దుయ్యబట్టారు. పోలవరంలో అవినీతికి పాల్పడ్డామన్నారు.. నిరూపించారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేతకాని సీఎం దాని గురించి మాట్లాడతారని అన్నారు. ప్రాంతాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటారా?.. ఓట్ల కోసం ప్రాంతాలు, కులాలు, మతాలను రెచ్చగొడతారా? అంటూ మండిపడ్డారు. తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులేనని, తెలుగువారే తన కులం, మతం అని చంద్రబాబు అన్నారు.


పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై విషప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉందన్నారు. ఐటీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, భయపడకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను రద్దు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-04T19:36:02+05:30 IST