దేవినేని ఉమా కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ
ABN , First Publish Date - 2021-07-30T00:23:31+05:30 IST
మాజీమంత్రి దేవినేని ఉమా కుటుంబసభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
అమరావతి: మాజీమంత్రి దేవినేని ఉమా కుటుంబసభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే ఉమాను కక్షపూరితంగా అరెస్ట్ చేశారని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ఉమా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. దేవినేనిపై జరిగిన దాడిలో యాక్షన్ రివర్స్ అయింది. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ చూసివస్తున్న ఆయన కారుపై వైసీపీ శ్రేణులు మంగళవారం దాడి చేయగా.. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు ఆయన్నే నిందితుడిగా చేర్చారు. పైగా హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదుచేశారు. ఉమ సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఆయన్ను మాత్రమే అరెస్టు చేశారు. వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతూ.. చివరకు బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మైలవరం సివిల్ జూనియర్ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. నూజివీడు, గన్నవరం సబ్జైళ్లు ఖైదీలతో నిండిపోవడంతో చివరకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని కోర్టు ఆదేశించింది.