Chandrababu: కఠిన శిక్షలతోనే మహిళలపై నేరాల అదుపు..

ABN , First Publish Date - 2022-09-06T18:24:26+05:30 IST

కఠిన శిక్షలతోనే మహిళలపై నేరాలను అదుపు చేయవచ్చునని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu: కఠిన శిక్షలతోనే మహిళలపై నేరాల అదుపు..

అమరావతి (Amaravathi): కఠిన శిక్షలతోనే మహిళలపై నేరాలను అదుపు చేయవచ్చునని, పోలీసులు శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)సూచించారు. నెల్లూరు ఘటనపై చంద్రబాబు ట్వీట్ (Tweet) చేశారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి...ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి..ఆపై గొంతు కోసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేదని ఇంకోసారి రుజువైందన్నారు. 


అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇటువంటి నేరాలు పునరావృతం కావని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక  ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు మొన్ననే చెప్పాయన్నారు. ప్రభుత్వం కానీ,  పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయకపోవడంతోనే నేరగాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు. నేరం చేసిన వైసీపీ రౌడీలను వెనకేసుకు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని చంద్రబాబు కోరారు.

Updated Date - 2022-09-06T18:24:26+05:30 IST