పేదలకు చేరాల్సిన నిధులను మింగేస్తున్నారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-02-15T17:31:01+05:30 IST
ఏపీలో ఉపాధి నిదులు రూ. 261 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించడం..
అమరావతి: రాష్ట్రంలో ఉపాధి నిదులు రూ. 261 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించడం రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పేదలకు చేరాల్సిన నిధులను అధికార పార్టీకి చెందిన నేతలు మింగేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు ఆస్తులు లాక్కోడానికే ఆటోనగర్లోని స్థలాలపై ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ స్థలాలను కబ్జా చేయడానికి జగన్ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు, కృష్ణపట్నం థర్మల్ స్టేషన్లు అమ్మడానికి.. ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. ఉపాధి చూపకపోగా, ఉపాధి మార్గాలను కూడా మూసివేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులకు నష్టం చేసే 217 జీవోను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.