AP: వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని CID వేధించింది: Chandrababu

ABN , First Publish Date - 2022-07-03T20:34:23+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు.

AP: వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని CID వేధించింది: Chandrababu

అమరావతి (Amaravathi): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఏపీ డీజీపీ (DGP) రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ వేధింపులపై ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను.. సీఐడీ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించారని మండిపడ్డారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఇంట్లోకి చొరబడి వాళ్ల కుటుంబీకులను భయబ్రాంతులకు గురిచేశారని, స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడడం దారుణమన్నారు.

   

విచారణ సమయంలో గదిలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ అధికారులు వ్యవహరించారన్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందన్నారు. టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ శ్రేణులను అక్రమంగా అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీకి ఏముందని? ప్రశ్నించారు. కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు డీజీపీ అండగా నిలబడాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T20:34:23+05:30 IST