Chandrababu: టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-02T22:07:36+05:30 IST

పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. పని తీరు మెరుగుపడని నేతల విషయంలో

Chandrababu: టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

అమరావతి: పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. పని తీరు మెరుగుపడని నేతల విషయంలో కఠిన నిర్ణయాలుంటాయని తెలిపారు. తాను గట్టిగా తిరుగుతున్నానని, మరో వైపు కార్యకర్తలూ పోరాడుతున్నారని గుర్తుచేశారు. మహానాడు (Mahanadu)కు క్యాడర్ ఎలా వచ్చిందో చూశామని, ప్రజల్లో, క్యాడర్‌లో ఆవేదన ఉందని, కానీ కొందరు నేతలు ఇంకా తమ పని తాము చేయట్లేదని తప్పుబట్టారు. పార్టీ పదవులు ఇచ్చినప్పుడు కార్యక్రమాలు ఎందుకు చేయడం లేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికే మూడున్నర ఏళ్లు అయిందని, నేతలు యాక్టివ్ అవుతారని ఇక ఎదురుచూసేది లేదని, ఇకపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ఆయన  హెచ్చరించారు. గతంలో ప్రకటించినట్లు 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. పని చేసేవారికే పదవులిచ్చేలా మెకానిజం తీసుకొస్తామని తెలిపారు. అక్రమ కేసుల్లో కార్యకర్తలు జైలుకెళ్తే.. నేతలు అండగా ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లాయర్‌ను పెట్టుకోవాలని, న్యాయ పోరాటంతో కార్యకర్తలను కాపాడుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. తప్పు చేసిన పోలీసులపై ప్రైవేట్‌ కేసులు ఎందుకు వేయట్లేదని నిలదీశారు. 


‘‘ఇది ప్రతిఒక్కరికీ అలుసుగా మారింది. గత మూడేళ్లుగా పోరాడుతూ అక్రమ కేసుల్లో ఇరుక్కున్నవారికి.. పార్టీలో అన్ని రకాలుగా ప్రాధాన్యమిస్తాం. అక్రమ కేసుల్లో జైలుకెళ్లినవారిని పార్టీ కోసం పోరాడిన యోథులుగా గుర్తిస్తాం. ముందస్తు అరెస్ట్‌లపై కొందరు నేతల తీరు సరిగాలేదు. కార్యక్రమానికి పిలుపునిచ్చి.. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అరెస్టయ్యామంటే తగదు. హౌస్ అరెస్టయ్యాం.. ఇక మనకి పనిలేదనుకునే కొందరి నేతల తీరు సరికాదు. గృహనిర్బంధాలపై పోలీసులను గట్టిగా నిలదీయాలి. కొందరు పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడి ఇష్టానుసారం ప్రవర్తిస్తే.. న్యాయస్థానంలో వారిని దోషులుగా నిలబెడతాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2022-09-02T22:07:36+05:30 IST