అక్కడే విఫలమయ్యాం.. వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదు : చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-29T19:31:52+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు...

అక్కడే విఫలమయ్యాం.. వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదు : చంద్రబాబు

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక విషయాలతో పాటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై కూడా నిశితంగా చర్చించారు. అనంతరం ఈ భేటీకి సంబంధించి టీడీపీ కార్యాయలం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదలతో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని బాబు విమర్శలు గుప్పించారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్‌లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. దీనిపై కచ్చితంగా న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. వరద బాధితులకు ఇంతవరకూ ఎలాంటి నష్ట పరిహారం అందలేదని.. ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సీడీని కూడా తగ్గించారన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని బాబు ఆరోపించారు. వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు.


ఇది దుర్మార్గపు చర్యే..!

చట్ట వ్యతిరేకమైన నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీల నిధుల మళ్లింపు విద్యావ్యవస్థ ప్రమాణాల్ని దిగజార్చుతుంది. అభయ హస్తం పధకాన్నీ జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. డ్వాక్రా మహిళలు ఎల్ ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారు. ఎల్ఐసీని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గపు చర్య. ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం తెలపాలి. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలిఅని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సూచించారు.


మేం అధికారంలోకి వచ్చాక..!

పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొంది. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి వచ్చింది. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారు. ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరూ కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ సభను జగన్ రెడ్డి కౌరవ సభగా మార్చారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి.. మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చిస్తాం. సీఎఫ్ఎంఎస్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయకుండా నిధులు పక్కదారి పట్టించారు అని చంద్రబాబు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీల నిధుల్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో డిపాజిట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడాన్ని టీడీపీ నేతలు ఖండించారు.


అక్కడే విఫలం.. పోటీ పడం..!

‘సమర్థంగా పనిచేసిన నేతలకు భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఫేక్ ఓట్లు తొలగింపుపై పార్టీ నేతలు కృషి చేయాలి. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంపై అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి జగన్ రెడ్డి లబ్ధి పొందారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇప్పుడు అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి అణచివేతను బలంగా తిప్పికొట్టాలి. జగన్ రెడ్డి విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. భవిష్యత్‌లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఉన్మాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాలరాస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చివరిగా అసెంబ్లీ ఘటన గురించి ప్రస్తావన రాగా.. వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదని.. అధికార పార్టీ తీరును క్షేతస్థాయిలో ఎండగట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Updated Date - 2021-11-29T19:31:52+05:30 IST