విశాఖ చేరుకున్న చంద్రబాబు
ABN , First Publish Date - 2021-03-05T21:17:47+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విశాఖలో రెండ్రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విశాఖలో రెండ్రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పెందుర్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్షో నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. తిరిగి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు.
గత ఏడాది మార్చిలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు 98 వార్డుల నుంచి 1,361 నామినేషన్లు దాఖలు కాగా వీటిలో 99 నామినేషన్లను అధికారులు పరిశీలన అనంతరం తిరస్కరించారు. మిగిలిన 1,262 నామినేషన్లు ఆమోదించారు. కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికలను వాయిదా వేశారు. కొంతకాలం తరువాత కేసులు తగ్గడంతో ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తూ ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.