Chandrababu Tweet: అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-07T20:42:33+05:30 IST

కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తప్పుబట్టారు.

Chandrababu Tweet: అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోం: చంద్రబాబు

అమరావతి: కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తప్పుబట్టారు. కుప్పం ఘటనపై చంద్రబాబు ట్వీట్‌ (Tweet) ద్వారా స్పందించారు. బరితెగించిన పోలీసులను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) అదుపులో పెట్టాలని సూచించారు. తప్పు చేసిన ఎంపీలను సమర్ధించే నీచ స్థాయికి.. కొందరు పోలీసులు వెళ్లడం దారుణమన్నారు. కొందరి పోలీసుల తీరు వల్ల డిపార్ట్‌మెంట్‌లకే తలవంపులు తెస్తున్నారని మండిపడ్డారు. నిరసన తెలిపిన టీడీపీ (TDP) నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని ప్రకటించారు. అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. 


గోరంట్ల మాధవ్‌ వికృత చేష్టలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం చిత్తూరు జిల్లా  కుప్పంలో టీడీపీ నాయకులు నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలకు ప్రయత్నించారు. అయితే, అందుకు సీఐ శ్రీధర్‌ అనుమతించలేదు. మాధవ్‌కు వ్యతిరేకంగా దేశమంతా నిరసనలు జరుగుతున్నప్పుడు.. ఇక్కడ చేస్తే తప్పేంటని చంద్రబాబు పీఏ మనోహర్‌.... సీఐని ప్రశ్నించారు. దీంతో సీఐ శ్రీధర్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఇలాంటి పను లు ఎవరు చేయడం లేదు? అంతమాత్రానికే దిష్టిబొమ్మను దహనం చేస్తారా’ అంటూ వాగ్వాదానికి దిగారు. ‘‘మీరు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అప్పుడు తప్పేమీ చేయలేదా? అయితే నువ్వు దేశాన్నే కాల్చేయ్‌’’ అని సీఎం అన్న వీడియో వైరల్‌ అయింది. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండు చేరుకుని ఆందోళనకు దిగాయి. పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ మనోహర్‌తో పాటు 15 మందిపై  కేసులు నమోదు చేశారు. కాగా, గతంలో పోలీసుగా పనిచేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌, కుప్పం సీఐ శ్రీధర్‌లది ఒకే బ్యాచ్‌ అని, ఇద్దరూ స్నేహితులని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-07T20:42:33+05:30 IST