గౌతమ్రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు
ABN , First Publish Date - 2022-02-22T02:15:36+05:30 IST
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియల స్థలాన్ని మార్చుతున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియల స్థలాన్ని మార్చుతున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ముందుగా గౌతంరెడ్డి పార్థివదేహానికి బుధవారం ఆయన సొంత గ్రామమైన బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. మంగళవారం ఉదయం నెల్లూరుకి ఎయిర్ అంబులెన్స్లో గౌతమ్రెడ్డి భౌతికకాయం తీసుకెళ్తారు. జిల్లా ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్లో గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తీసుకెళ్తారు. అక్కడే గౌతమ్రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు.
బ్రాహ్మణపల్లిలో జననం
గౌతమ్రెడ్డి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్మాహ్మణపల్లిలో జన్మించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మణిమంజరిలకు ఆయన ప్రథమ సంతానం. ఆయన ఉన్నత చదువులు పూర్తి చేసుకుని 1997 మార్చిలో ఆయన కుటుంబసభ్యులు నడుపుతున్న కెఎంసీ కనస్ట్రెక్స్న్స్లో అడుగు పెట్టాడు. కెఎంసీ పురోగతికి తన వంతు కృషి చేశాడు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, బడాకాంట్రాక్టర్గా, దేశ విదేశాల్లో కేఎంసీ సంస్థ అధినేతగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ సందర్భంలోనే గౌతంరెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డితో స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి రాజకీయ వారసుడిగా మేకపాటి గౌతంరెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ మార్పుల్లో మేకపాటి కుటుంబం జగన్ పక్షాన నిలచింది. అప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా(నెల్లూరు) ఉన్న మేకపాటి రాజమోహన్రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఈ చేరిక వెనుక జగన్తో గౌతమ్రెడ్డికి ఉన్న స్నేహమే ప్రధాన కారణమనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి మేకపాటి కుటుంబం జగన్కు అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నది.