కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?
ABN , First Publish Date - 2022-07-09T08:03:15+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలున్నాయి.
తెలంగాణకు చెందిన మరో బీజేపీ నాయకుడికి చోటు!
ఇటీవల వైదొలగిన నఖ్వీ, ఆర్సీపీ సింగ్ స్థానాల భర్తీ
పనితీరు బాగోలేని కొందరు సహచరులకు ఉద్వాసన
రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న రాష్ట్రాల వారికి బెర్తు
కొత్త రాష్ట్రపతి బాఽధ్యతల స్వీకరణ తర్వాత ముహూర్తం
న్యూఢిల్లీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలున్నాయి. రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడంతో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ ఇటీవల పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తప్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు చెందిన కొందరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి మరో నేతకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలోనూ 2023లో ఎన్నికలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో ఈ నాలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, కొత్త రాష్ట్రపతి ఈ నెల 17న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాతే మోదీ మంత్రివర్గాన్ని విస్తరించవచ్చునని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావే శాలు జరుగనున్నాయి.