కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం పరువునష్టం కేసు

ABN , First Publish Date - 2022-01-21T22:59:40+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేయనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి..

కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం పరువునష్టం కేసు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేయనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారంనాడు చెప్పారు. తనను ''నిజాయితీ లేని వ్యక్తి''గా సంబోధిస్తూ ట్విట్టర్ హ్యాండిల్‌లో కేజ్రీవాల్ ఒక పోస్ట్ చేసినట్టు చన్నీ తెలిపారు. ఆయనపై పరువునష్టం కేసు వేసేందుకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరినట్టు చెప్పారు. కేజ్రీవాల్ అన్ని హద్దులూ అతిక్రమించారని, ఇతరుల ప్రతిష్టను భంగపరచేలా ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. గతంలో కూడా ఇలాంటి పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు ఆయన చేశారని, వాటిపై నితిన్ గడ్కరి, దివంగత అరుణ్ జైట్లీ, సాద్ నేత బిక్రం సింగ్ మజితాయ్‌కి కేజ్రీవాల్ క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు.


కాగా, మనీ లండరింగ్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పంజాబ్ సీఎం మేనల్లుడి ఇంటిపై ఇటీవల ఈడీ దాడులు చేసింది. ఆయన బంధువుల ఇళ్లలో రూ.8 కోట్లతో సహా మొత్తం రూ.10 కోట్ల వరకూ స్వాధీనం చేసుకుంది. దీనిని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటూ, చన్నీ మామూలు వ్యక్తి కాదని, నిజాయితీ లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-01-21T22:59:40+05:30 IST