Naval Power: శక్తిమంతమైన నావికా దళానికి ఛత్రపతి శివాజీ బలమైన పునాదులు
ABN , First Publish Date - 2022-09-02T21:58:42+05:30 IST
భారత నావికా దళం జెండా భారతీయతను నింపుకుని సగర్వంగా
న్యూఢిల్లీ : భారత నావికా దళం జెండా భారతీయతను నింపుకుని సగర్వంగా ఎగురుతోంది. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తిగా నిలిచారు. దీనిని ఆవిష్కరించిన మోదీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు భారత నావికా దళం జెండా బానిసత్వ చిహ్నాన్ని మోసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ నావికా దళాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో తెలుసుకుందాం.
చోళుల తర్వాత సముద్ర తీరం ప్రాముఖ్యతను భారతీయ పాలకులు గుర్తించలేకపోయారు. దీంతో పోర్చుగీసు వంటి విదేశీయులు భారత దేశ సముద్రాలపై నియంత్రణ సాధించారు. దీనిని ఛత్రపతి శివాజీ మహారాజు గమనించారు. 1650వ దశకంలో భారత నావికా దళానికి బలమైన పునాదులు వేశారు. పోర్చుగీసు, డచ్వారి నుంచి పాఠాలు నేర్చుకుని నావికా దళాన్ని ఏర్పాటు చేశారు. భారత దేశానికి చెందిన నౌకాశ్రయాలను ఉపయోగించుకోవాలంటే అప్పట్లో పోర్చుగీసు, డచ్వారి అనుమతి అవసరమయ్యేది. శివాజీ వద్ద ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం ఉండేది, పెద్ద నౌకలను తయారు చేసే విధానాన్ని విదేశీయుల నుంచి తెలుసుకున్నారు. మొత్తం మీద కొంత కాలానికి సముద్ర తీరాలను పరిరక్షించగలిగే దుర్గాలను విజయవంతంగా నిర్మించగలిగారు. ఇవి కొంకణ్ వరకు విస్తరించాయి. 50కి పైగా నౌకలను నిర్మించారు, 10,000 మంది నావికులను నియమించుకున్నారు. 1650వ దశకం చివర్లో ఆయన ఈ నావికా దళం ఏర్పాట్లను ప్రారంభించారు. 1674 నాటికి, అంటే దాదాపు రెండు దశాబ్దాల్లో, భారీ నావికా దళాన్ని ఏర్పాటు చేయగలిగారు. దీంతో మొఘల్ రాజులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న శివాజీ తమ రాజ్యాలపై దండెత్తే అవకాశం ఉందని భయపడేవారు.
భారత నావికా దళం జెండాను ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రూపొందించడం సరికొత్త శకానికి నాందిగా భావిస్తున్నారు. గత కాలపు వలస పాలన అవశేషాలను వదిలించుకున్నట్లయిందని చెప్తున్నారు. కొత్త జెండాలో అష్టభుజి నావికా దళానికిగల బహుముఖ సత్తాను చాటి చెప్తోందని వివరిస్తున్నారు.