చాటింగ్‌ చేయొద్దని భర్త మందలించడంతో...

ABN , First Publish Date - 2020-10-27T10:11:17+05:30 IST

సెల్‌ఫోన్‌లో అదే పనిగా చాటింగ్‌ చేయొద్దని భర్త మందలించడంతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది

చాటింగ్‌ చేయొద్దని భర్త మందలించడంతో...

అల్వాల్‌, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌లో అదే పనిగా చాటింగ్‌ చేయొద్దని భర్త మందలించడంతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. భూదేవినగర్‌లోని వెంకటాపురం లాస్ట్‌ బస్టాప్‌ ప్రాంతంలో రోషన్‌ జమీర్‌, రోషన్‌ నహీలా (42) భార్యాభర్తలు నివశిస్తున్నారు. వీరి కుమార్తె సోన్‌ ఆఫ్రీన్‌. ఇటీవల దంపతులిద్దరూ కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అనంతరం భర్త రోషన్‌ జమీర్‌ నిద్ర పోయాడు. 3 గంటల సమయంలో నిద్రలో నుంచి మెలకువ రావడంతో లేచి చూడగా అప్పటి వరకు భార్య సెల్‌లో చాటింగ్‌ చేస్తూ కనిపించింది. ఎక్కువగా చాటింగ్‌ చేస్తే అనారోగ్యం కలుగుతుందని, ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో విశ్రాంతి అవసరమని చెప్పి భార్య సెల్‌ ఫోన్‌ తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. మనస్తాపానికి గురైన రోషన్‌ నహీలా ఇంట్లోని హాల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రోషన్‌ జమీర్‌ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో లేచి చూడగా భార్య బెడ్‌రూమ్‌లో కనిపించలేదు. హాల్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కూతురి సహాయంతో కిందికి దించి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది. దీంతో రోషన్‌ అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-10-27T10:11:17+05:30 IST