5G: ‘4జీ నుంచి 5జీకి మారండి’ అని మెసేజ్‌ వచ్చిందా కొంపదీసి..!

ABN , First Publish Date - 2022-10-06T03:47:26+05:30 IST

5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇదే అదునుగా భావించే సైబర్‌ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు..

5G: ‘4జీ నుంచి 5జీకి మారండి’ అని మెసేజ్‌ వచ్చిందా కొంపదీసి..!

5జీ సర్వీస్‌ల పేరుతో సైబర్‌ మోసాలు

తస్మాత్‌ జాగ్రత్త అంటున్న పోలీసులు


హైదరాబాద్‌: 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇదే అదునుగా భావించే సైబర్‌ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు తెరలేపి అందినంతా దోచేస్తారని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 5జీ సేవల వినియోగం కోసం కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ‘4జీ నుంచి 5జీ మారండి. మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తాం’ అంటూ.. కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌లు, లింక్‌లు పంపిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. దాంతో బ్యాంకు ఖాతాలకు లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌ తెలుసుకుంటారన్నారు. ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయించి, సిమ్‌ స్వాప్‌ దందాకు పాల్పడి, అదే నంబర్‌తో మరోసిమ్‌ తీసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేసి డబ్బంతా కొల్లగొడతారని హెచ్చరిస్తున్నారు. లేదా 5జీ సర్వీస్‌లు అందిస్తున్నామంటూ వివిధ రకాల చార్జీల పేరుతో అందినంతా దండుకొని ఉడాయిస్తారని తెలిపారు. ఇటువంటి పలు రకాల సైబర్‌ మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-10-06T03:47:26+05:30 IST