Chennaiలో ఆటోమేటిక్ సిగ్నలింగ్
ABN , First Publish Date - 2022-06-18T13:15:03+05:30 IST
చెన్నై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా నగర వ్యాప్తంగా కొత్తగా 165 ప్రాంతాల్లో
- 165 ప్రాంతాల్లో ఏర్పాటు
- రూ.904 కోట్లతో ఐటీఎస్ ప్లాన్
అడయార్(చెన్నై), జూన్ 17: చెన్నై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా నగర వ్యాప్తంగా కొత్తగా 165 ప్రాంతాల్లో ఆటోమేటిక్ సిగ్నళ్లను ఏర్పాటుచేయనున్నారు. అలాగే, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేజేషన్ సిస్టమ్ (ఐటీఎస్) అమలు చేయనున్నారు. ఇందుకోసం రూ.907.88 కోట్లను ఖర్చు చేయనున్నారు. జపాన్కు చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఆరంభంలో ఈ పథకం మొత్తం ఖర్చు రూ.666 కోట్లుగా పేర్కొన్నప్పటికీ ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచారు. ఈ పథకంలో భాగంగా నగర వ్యాప్తంగా 165 ప్రాంతాల్లో ఆటోమేటిక్ సిగ్నళ్లను ఏర్పాటుచేస్తారు. అలాగే, మరో 17 చోట్ల ఇమేజ్ డిస్ప్లే సిస్టమ్ను అమర్చుతారు. 55 ప్రాంతాల్లో ప్రమాదాలను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, నిర్వహణా చర్యల్లో భాగంగా 115 చోట్ల ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటరు కమ్ క్లాసిఫయర్ సిస్టమ్ను, ఇక ఇన్వెస్టిగేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు వివిధ రకాలైన అత్యాధునిక వ్యవస్థలను ఈ పథకం కింద నగరంలో ఏర్పాటు చేసి ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేలా చర్యలు తీసుకోనున్నారు.