Chennai: దసరా అంటే ఇలా ఉంటదా.. మూడు రోజుల్లో 8 లక్షల మంది పయనం
ABN , First Publish Date - 2022-10-04T23:00:39+05:30 IST
వరుస సెలవులతో రాజధాని నగరం చెన్నై నుంచి గత మూడురోజుల్లో బస్సులు, రైళ్లు, కార్లలో సుమారు ఎనిమిది లక్షలమంది స్వస్థలాలకు..
చెన్నై (ఆంధ్రజ్యోతి): వరుస సెలవులతో రాజధాని నగరం చెన్నై నుంచి గత మూడురోజుల్లో బస్సులు, రైళ్లు, కార్లలో సుమారు ఎనిమిది లక్షలమంది స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళారు. సోమవారం రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సులలో వేలాదిమంది సొంతవూళ్లకు పయనమయ్యారు. దీంతో కోయంబేడు బస్స్టేషన్, తాంబరం సమీపం పెరుంగళత్తూరు బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో గత మూడురోజులుగా 4.5 లక్షల మంది పలు నగరాలకు బయలుదేరి వెళ్ళినట్లు రవాణా శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు. ఇదే విధంగా ఆమ్నీ బస్సులు, రైళ్లలోనూ లక్షలాదిమంది టికెట్లు రిజర్వేషన్ చేసుకుని మరీ స్వస్థలాలకు వెళ్ళారు. గత మూడు రోజులుగా తిరుచ్చి, కోయంబత్తూరు, నాగపట్టినం, తంజావూరు, మదురై తదితర నగరాలకు 7500లకు పైగా బస్సులను నడిపారు. సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన 500 ప్రత్యేక బస్సులు నడిపారు. ఆ బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి.