Chennaiలో హెల్మెట్ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-05-22T12:38:45+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో సోమవారం నుంచి ద్విచక్రవాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని మహానగర ట్రాఫిక్‌ పోలీసుల విభాగం ఉత్తర్వు జారీ చేసింది. మోటారు బైకులు,

Chennaiలో హెల్మెట్ తప్పనిసరి

- రేపటినుంచి అమల్లోకి నిబంధన 

- 312  ట్రాఫిక్‌ కూడళ్లలో నిఘా


చెన్నై: రాజధాని నగరం చెన్నైలో సోమవారం నుంచి ద్విచక్రవాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని మహానగర ట్రాఫిక్‌ పోలీసుల విభాగం ఉత్తర్వు జారీ చేసింది. మోటారు బైకులు, స్కూటర్లు నడిపేవారితోపాటు వెనుకసీటులో ప్రయాణించేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందేనని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. హెల్మెట్లు ధరించకుండా ద్విచక్రవాహనాలను నడిపేవారిని అదుపులోకి తీసుకుని జరిమానా విధించేందుకు వీలుగా నగరంలో 312 ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర నిఘా వేయనున్నారు. నగరంలో ద్విచక్రవాహనాల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఆ సందర్భంగా హెల్మెట్లు ధరించని వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల ట్రాఫిక్‌ పోలీసుల విభాగం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

 గతేడాది జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 15 వరకు నగరంలో జరిగిన ద్విచక్రవాహనాల ప్రమాదాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ మేరకు నగరంలో హెల్మెట్లు ధరించని 98 మంది మృతి చెందారని, 841 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడైంది. దీంతో నగరంలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను తగ్గించే దిశగా హెల్మెట్ల ధారణను నిర్బంధం చేస్తూ ట్రాఫిక్‌ పోలీసుల విభాగం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి ఉత్తర్వు అమల్లోకి రానుందని ఈ విభాగ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ద్విచక్రవాహనదారులు  హెల్మెట్లు ధరించకపోతే ఆయా ప్రాంతాల్లో జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చుని ప్రయాణించేవారు పెద్దవారైనా, చిన్నవారైనా తప్పకుండా హెల్మెట్లు ధరించాలని చెప్పారు. నగరమంతటా హెల్మెట్లు ధరించకుండా ద్విచక్రవాహనాలను నడిపేవారిని ట్రాఫిక్‌పోలీసులు వీడియో తీసి, వాటి ఆధారంగానే జరిమానా విధించనున్నట్లు ఆయన వివరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు కొనేందుకు ఆదివారం గడువిస్తున్నామని, సోమవారం నుంచి హెల్మెట్లు ధరించేవారు ప్రయాణించాలని ఆ అధికారి చెప్పారు.

Updated Date - 2022-05-22T12:38:45+05:30 IST