Chennaiలో అంతర్జాతీయ మహిళా టెన్నిస్ పోటీలు
ABN , First Publish Date - 2022-05-15T14:22:47+05:30 IST
రాజధాని నగరం చెన్నైలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా టెన్నిస్ పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు సన్నాహాలు చేపడుతోంది. ఆ మేరకు సచివాలయంలో
- రూ.5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
చెన్నై: రాజధాని నగరం చెన్నైలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా టెన్నిస్ పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు సన్నాహాలు చేపడుతోంది. ఆ మేరకు సచివాలయంలో శనివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ పోటీ నిర్వహణకు సంబంధించిన అనుమతి పత్రాన్ని రాష్ట్ర టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ అమృతరాజ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంక్షేమ శాఖ మంత్రి వి.మెయ్యనాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఇరై అన్బు, యువజన, సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల ప్రధాన కార్యదర్శి అపూర్వా, రాష్ట్ర టెన్నిస్ సంఘం ప్రధానాధికారి హిడేన్ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మెయ్యనాధన్ విలేఖరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా టెన్నిస్ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్ల మేర నిధులను కేటాయించిందని తెలిపారు. స్థానిక నుంగంబాక్కంలో టెన్నిస్ క్రీడా మైదానంలో వచ్చే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మహిళా టెన్నిస్ క్రీడా పోటీలను నిర్వహించే అరుదైన అవకాశం రాష్ట్రానికి దక్కిందని ఆయన చెప్పారు. నుంగంబాక్కంలోని క్రీడా మైదానంలో 1997 నుంచి 2017 వరకూ ఏటీపీ టెన్నిస్ పోటీలను నిర్వహించామని, ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా టెన్నిస్ పోటీలకు ఆ క్రీడా మైదానమే వేదికకానుందని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన రూ.5కోట్ల నిధులను మైదానం మరమ్మతు పనులకు, క్రీడాపోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వుల మేరకు వచ్చే ఏడాది బీచ్వాలీబాల్ పోటీలను కూడా నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.